నిమ్మ‌గ‌డ్డ ఎఫెక్ట్‌… టీడీపీ ఇలా.. వైసీపీ అలా కుమిలిపోతున్నాయా?

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యం.. రాష్ట్రంలోని అన్ని పార్టీల‌ను ఒక్కో ర‌కంగా ఇబ్బంది పెడుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కార్పొరేష‌న్‌, మునిసిపాలిటీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేశారు.

అయితే.. దీనికి కొత్త‌గా నోటిపికేష‌న్ ఇవ్వాల‌ని అదికార వైసీపీ త‌ప్ప‌.. మిగిలిన అన్ని పార్టీలూ డిమాండ్ చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. నిమ్మ‌గ‌డ్డ మాత్రం గ‌త ఏడాది స్థానిక ప్ర‌క్రియ ప్రారంభ‌మైన చోట నుంచి.. ఎక్క‌డ నిలిపివేశారో.. అక్క‌డి నుంచే తిరిగి ప్రారంభిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ ప్ర‌కార‌మే తాజాగా నోటిఫికేష‌న్ జారీ చేశారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. నిమ్మ‌గ‌డ్డ తీసుకున్న నిర్ణ‌యం.. వైసీపీని ఒక‌విధంగా .. ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం టీడీపీని మ‌రో విధంగా ఇబ్బంది పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. చాలా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో.. టీడీపీ గ‌తంలో బీఫారాలు ఇచ్చి.. కార్పొరేట‌ర్లుగా, వార్డు మెంబ‌ర్లుగా నిల‌బెట్టిన వారు.. ఇప్పుడు వైసీపీలోకి చేరిపోయారు.

ఈ ప‌రిస్థితి ప్ర‌కాశం, గుంటూరు, విశాఖ‌ల్లో ఎక్కువ‌గా ఉంది. వారంతా ఇప్పుడు వైసీపీ స‌భ్యులుగానే ఉంటారు. వాస్త‌వానికి టీడీపీ బీపారంపై నామినేష‌న్ వేసిన వారు.. క‌నుక‌.. వీటిని వారు ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం ఉంది. వైసీపీ నేత‌లు కూడా ఇదే మాట చెబుతున్నారు.

దీంతో టీడీపీ త‌ర‌ఫున ఆయా కార్పొరేష‌న్ల‌లో పోటీ చేసే నాయ‌కుల‌కు కొర‌త ఏర్ప‌డుతుంది. పోనీ.. ఇప్పుడు.. కొత్త‌గా నామినేష‌న్లు వేద్దామా? అంటే.. అది సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. సో.. ఇది టీడీపీకి తీవ్ర న‌ష్టం. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో బీఫారాలు తీసుకుని రంగంలోకి దిగిన వైసీపీ అభ్య‌ర్థుల్లో రాష్ట్రంలోని 12 కార్పొరేష‌న్లు 75 మునిసిపాలిటీల్లో.. సుమారు 10 మంది వ‌ర‌కు మృతి చెంది ఉంటార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వీరి గురించి ఆరా తీస్తున్నారు. పోనీ.. వీరి వివ‌రాలు తెలుసుకుని.. ఆయా చోట్ల మ‌ళ్లీ నామినేష‌న్ వేయిద్దామా? అంటే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో అది సాధ్యం కాదు. సో.. ఇలా ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ ఒక విదంగా.. అధికార పార్టీ మ‌రో విధంగా ఇబ్బంది ప‌డుతోంద‌ని అంటున్నారు.