14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ‘ఉప్పెన’


కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రంలా ఎంతమాత్రం కనిపించడం లేదు ‘ఉప్పెన’. పెద్ద స్టార్లు నటించిన సినిమాలకు దీటుగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఉప్పెనతో దూసుకెళ్తోంది. ఈ సినిమా రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తుండటం విశేషం. తొలి రోజే రూ.10 కోట్లకు పైగా షేర్‌తో తెలుగులో ఓ డెబ్యూ హీరో సినిమా ఫస్ట్ డే వసూళ్ల రికార్డులను భారీ తేడాతో బద్దలు కొట్టిన ఈ చిత్రం.. తాజాగా మరో సంచలన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఒక అరంగేట్ర హీరో సినిమా ఫుల్ రన్ వసూళ్ల రికార్డును కేవలం మూడే మూడు రోజుల్లో బద్దలు కొట్టేసింది.

వైష్ణవ్ తేజ్ ఖాతాలోకి చేరిన ఈ రికార్డు 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రం ‘చిరుత’ది కావడం విశేషం. ఆ చిత్రం 2007లో విడుదలై రూ.25 కోట్ల షేర్ సాధించి రికార్డు నెలకొల్పింది. మధ్యలో ‘అఖిల్’ సినిమాకున్న హైప్ చూసి ‘చిరుత’ రికార్డు బద్దలైపోతుందేమో అనుకున్నారు. కానీ ఆ సినిమా తొలి రోజు ఏడున్నర కోట్లు వసూలు చేసింది కానీ.. రెండో రోజుకు చల్లబడిపోయింది. రికార్డు కొట్టకపోగా భారీ నష్టాలతో బయ్యర్లను ముంచేసింది. ఇక ‘ఉప్పెన’ సినిమా విషయానికి వస్తే.. రిలీజ్ ముంగిట ఉన్న అంచనాలను మించిపోయి ఆ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది.

తొలి రోజు పది కోట్లకు పైగా షేర్ రాబట్టడమే అద్భుతం అనుకుంటే.. తర్వాతి రెండు రోజుల్లోనూ తొలి రోజుకు దీటుగా వసూళ్లు రాబట్టింది. మూడో రోజు రూ.8.26 కోట్ల షేర్‌తో ఔరా అనిపించింది. దీంతో ‘ఉప్పెన’ మూడు రోజుల షేర్ రూ.28 కోట్లను దాటిపోయింది. ‘చిరుత’ రికార్డు చరిత్రలో కలిసిపోయింది. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. మూడో రోజు తెలుగులో కేవలం 8 చిత్రాలు మాత్రమే రూ.8 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. అందులో ‘ఉప్పెన’ ఒకటి. మహర్షి, ఖైదీ నంబర్ 150 లాంటి వంద కోట్ల సినిమాల కంటే ఎక్కువగా మూడో రోజు ఉప్పెన షేర్ ఉండటం సంచలనం రేపుతున్న విషయం. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఇంకా ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.