కొడుకు కోసం జానారెడ్డి సైలెంట్ స్కెచ్ ?

తొందరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా తన కొడుకు రఘువీర్ రెడ్డిని పోటీ చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎందుకైనా మంచిదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందాన్ని రంగంలోకి దింపారట. రానున్న ఎన్నికల్లో తాను కానీ లేకపోతే తన కొడుకు కానీ రంగంలోకి దిగితే ప్రజాస్పందన ఎలాగుంటుందనే విషయంలో జననాడిని పట్టుకునేందుకు ప్రశాంత్ తో జానారెడ్డి సర్వే చేయించుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణాలో ఇపుడు అన్నీ పార్టీల దృష్టి నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక మీదే ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీనే తమ అభ్యర్ధిని గెలిపించుకోవాలన్న ఉద్దేశ్యంతో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే అనేకమంది నేతలు తమ పార్టీల తరపున బరిలోకి దిగటానికి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిజానికి ఈ అసెంబ్లీ స్ధానం కాంగ్రెస్ కు కంచుకోటనే చెప్పాలి. ఎలాగంటే ఇక్కడి నుండే జానారెడ్డి ఏడుసార్లు గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య గెలిచారు.

అనారోగ్యం వల్ల నోముల మరణంతో ఇక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా జానారెడ్డికి మాత్రం మంచి డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీల తరపున పోటీ చేయాల్సిందిగా జానారెడ్డికి ఆఫర్ ఇచ్చాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆయన మాత్రం కాంగ్రెస్ తరపునే పోటీ చేయాలని మొదటినుండి అనుకుంటున్నారట. అయితే ఈ మధ్యనే కొడుకును రంగంలోకి దింపాలనే ఆలోచన వచ్చిందంటున్నారు. అందుకనే కొడుకు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారట.

ఎందుకైనా మంచిదని వ్యూహకర్త ప్రశాంత్ తో చర్చలు జరిపారట. అసలు ఏ పార్టీ పరిస్ధితి ఏమిటి ? కాంగ్రెస్ తరపున తాను పోటీ చేస్తే ఎలాగుంటుంది ? లేకపోతే తన కొడుకును రంగంలోకి దింపితే ఫలితం ఎలాగుంటుందనే విషయాలపై సర్వేలు చేయించుకోవాలని అనుకున్నారట. జానారెడ్డి అడిగిన తర్వాత ప్రశాంత్ బృందం వెంటనే రంగంలోకి దిగేసిందని సమాచారం. సో జానారెడ్డి పోటీ విషయంలో బాగా సీరియస్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది.