అందుకేనా క్రాక్ సీక్వెల్ అక్క‌డ చేస్తోంది


పారితోష‌కాల విష‌యంలో హీరోలు, ద‌ర్శ‌కులకు నిర్మాత‌ల‌తో పేచీలు టాలీవుడ్లో కొత్తేమీ కాదు. అత్తారింటికి దారేది లాంటి ఇండ‌స్ట్రీ హిట్ విష‌యంలోనూ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌మకు పూర్తి స్థాయిలో పారితోష‌కాలు అంద‌లేద‌ని నిర్మాత బీవీఎన్ ప్ర‌సాద్ మీద కేసు పెట్టే వ‌ర‌కు వెళ్లింది ప‌రిస్థితి.

ఇప్పుడు సంక్రాంతి విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన‌ క్రాక్ సినిమా విష‌యంలోనూ ఇలాంటి వివాద‌మే త‌లెత్తింది. నిర్మాత ఠాగూర్ మ‌ధు త‌న‌ పారితోష‌కం పూర్తిగా చెల్లించ‌లేద‌ని కేసు పెట్టాడు గోపీచంద్‌ తాజాగా. నాలుగ్గోడ‌ల మ‌ధ్య సెటిల్ చేసుకోవాల్సిన వ్య‌వ‌హారం కేసుల వ‌ర‌కు వెళ్లిందంటే తీవ్ర‌త అర్థం చేసుకోవ‌చ్చు. నిర్మాత‌కు ఉన్న ఫినాన్షియ‌ల్ ఇష్యూస్ వ‌ల్లే ఈ సినిమాకు తొలి రోజు విడుద‌ల విష‌యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వ‌డం తెలిసిందే. ఐతే ఆ అడ్డంకుల్ని దాటి విడుద‌లైన క్రాక్ భారీ విజ‌యాన్నందుకుంది. నిర్మాత‌కు సినిమా మంచి లాభాలే అందించి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

అయినా స‌రే.. గోపీచంద్‌కు పారితోష‌కం పూర్తి స్థాయిలో చెల్లించ‌లేదంటే ఆశ్చ‌ర్య‌మే. గోపీ కొన్ని రోజులు ఎదురు చూసి ఇప్పుడు ఫిర్యాదు వ‌ర‌కు వెళ్లిన‌ట్లున్నాడు. ఐతే ఠాగూర్ మ‌ధుతో త‌న‌కు విభేదాలున్నాయ‌ని కొన్ని రోజుల కింద‌టే గోపీచంద్ సంకేతాలు ఇచ్చేశాడు. క్రాక్ సినిమా సీక్వెల్ తీస్తాన‌ని, అది మైత్రీ మూవీ మేక‌ర్స్ బేన‌ర్లో ఉంటుంద‌ని ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత కొన్ని రోజుల‌కు మీడియాకు చెప్పాడు గోపీచంద్.

మామూలుగా ఓ సినిమా పెద్ద హిట్ట‌యితే ఆటోమేటిగ్గా అదే బేన‌ర్లో సీక్వెల్ తెర‌కెక్కుతుంటుంది. గోపీ అలా కాకుండా వేరే బేన‌ర్లో సీక్వెల్ అన్న‌పుడే వ్య‌వ‌హారం తేడాగా అనిపించింది. నిర్మాత‌తో విభేదాల‌ని తేలిపోయింది. ఇప్పుడు అత‌ను మ‌ధుపై కేసు పెట్ట‌డంతో అస‌లు విష‌యం బ‌య‌టికొచ్చింది. క్రాక్ రిలీజ్ ఇష్యూస్‌తో ఆల్రెడీ బ్యాడ్ అయిన మ‌ధుకు కేసు వ్య‌వ‌హారం మ‌రింత ఇబ్బందిక‌ర‌మే.