జగన్ డిసైడ్ అయితే.. ఆంధ్రుల హక్కును కాపాడుకోవటం కష్టం కాదు

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగోళ్లు ఎలుగెత్తటమే కాదు.. ఈ కర్మాగారం కోసం ఏకంగా 34 మంది ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలు వృధా కాకుండా ఉండేందుకు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏపీలో అతి పెద్ద సంస్థగా ఉన్న విశాఖ ఉక్కును కేంద్రం అమ్మకానికి పెట్టటం తెలిసిందే. 18 వేల మంది శాశ్విత ఉద్యోగులు.. 20వేల మంది ఒప్పంద కార్మికులతో ఉంటే ఈ సంస్థ ఏపీకి ఒక ఆభరణం లాంటిది. ఆ మాటకు వస్తే.. విశాఖ అన్నంతనే అందరికి గుర్తుకు వచ్చేది విశాఖ ఉక్కు కర్మాగారమే.

గుంటూరుకు చెందిన అమ్రతరావు అనే వ్యక్తి విశాఖ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేయటంతో విశాఖ ఉద్యమంలో కదలిక మొదలైంది. అంతలోనే అది పెద్దదైంది. తెలుగునాడును కుదిపేసింది. కేంద్రం సైతంఈ నిరసనను తట్టుకోలేక.. తన బెట్టును సడలించి.. విశాఖ ఉక్కుకు ఓకే చెప్పింది. ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిలో తెన్నేటి విశ్వనాథం ఒకరు. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఒక దశలో హింసాత్మకంగా మారిన ఈ ఉద్యమంలో 32మంది ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది.

విశాఖ ఉక్కు ఉద్యమాన్ని కట్టడి చేయాలని కేంద్రం ఎంత భావించినా.. అది ఫలించలేదు. చివరకు ఎమ్మెల్యేలు.. ఎంపీలు తమ రాజీనామా లేఖలు ఇచ్చారు. నిరాహార దీక్ష చేస్తున్న అమ్రతరావు ప్రాణాలకు ముప్పు ఉందన్న విసయాన్ని నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి.. ప్రధాని ఇందిరకు చెబితే.. చివరకు విశాఖలో ఉక్కుకర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ అధికారిక లేఖను ఇచ్చారు. దాన్ని సీఎం స్వయంగా చూపిన తర్వాతే అమ్రతరావు తన దీక్షను విరమించారు. అంతలా కష్టపడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని.. ఈ రోజు అమ్మేయటం అంటే.. అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు.

మరి.. దీన్ని అడ్డుకోవటం సాధ్యం కాదా? ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి చెక్ చెప్పే శక్తి ఎవరికి లేదా? అంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనే చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకోవాలే కానీ.. విశాఖ ఉక్కుకర్మాగారాన్ని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకునే మార్గం ఉంది. గతంలో ఒడిశాలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మాలన్న నిర్ణయం తీసుకుంటే.. దాన్ని తాము కొనుగోలు చేస్తామని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే రీతిలో ఏపీ సర్కారు కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్రం కొనుగోలు చేస్తుందని చెప్పాలి.

విశాఖ ఉక్కు కర్మాగారంలో రాష్ట్ర వాటాతో పోలిస్తే.. కేంద్ర వాటా తక్కువ. రివర్సు టెండరింగ్ ప్రాసెస్ లో.. ధరను కోట్ చేసి.. రాష్ట్రం తన వాటా కిందకు వచ్చే మొత్తాన్నిమినహాయించి.. కేంద్రానికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేస్తే.. విశాఖ హక్కును ప్రైవేటు పరం కాకుండా అడ్డుకునే వీలుంది. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే.. దాని కింద ఉన్న భూముల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లు. అంత విలువైన భూముల్ని ప్రైవేటు పరం చేసే కన్నా..రాష్ట్ర ప్రభుత్వమే సొంతం చేసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి.. ముఖ్యమంత్రిజగన్ ఏం చేస్తారో చూడాలి?