నితిన్ సందీప్‌పై పడ్డాడేంటి?


ఫిబ్రవరిలో ప్రతి వారానికీ ఓ పేరున్న సినిమా ఖరారైపోయింది ఆల్రెడీ. తొలి వారంలో ‘జాంబి రెడ్డి’ వస్తుండగా.. రెండో వారానికి ‘ఉప్పెన’ ఫిక్సయింది. మూడో వారానికి నితిన్ సినిమా ‘చెక్’ను చాలా రోజుల ముందే ఖరారు చేశారు. దీంతో మిగిలిన చివరి వారాన్ని సందీప్ కిషన్ తీసేసుకున్నాడు. తన కొత్త చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’ను ఫిబ్రవరి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. 26కే ‘అక్షర’ సైతం ఫిక్స్ అయింది. ముందు వారం సోలోగా నితిన్ సినిమా రిలీజవుతుండటం అతడికి కలిసొచ్చే విషయమే అనుకున్నారు.

కానీ ఆశ్చర్యకరంగా ‘చెక్’ రిలీజ్ డేట్‌ను హఠాత్తుగా మార్చేశారు. ఈ చిత్రం 19న కాకుండా 26న విడుదల కానున్నట్లు ప్రకటించారు. నితిన్ ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. డేట్ ఉన్న ‘చెక్’ పోస్టర్‌ను డీపీగా కూడా మార్చుుకున్నాడు. ఐతే ‘చెక్’ 19 నుంచి 26కు మారడానికి కారణాలేంటో అర్థం కావడం లేదు.

పోటీ ఎక్కువైందని సోలో రిలీజ్ కోసం ప్రయత్నించడం చూస్తుంటాం కానీ.. సోలో డేట్‌ను వదిలేసి మరో రెండు సినిమాలతో పోటీ పడటమేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెలలో వస్తున్న సినిమాల్లో ఎక్కువ అంచనాలున్నది ‘చెక్’ మీదే. అందుకే ఆ సినిమాకు ఎవరూ పోటీ వెళ్లడం లేదు. ఎవరి డేట్లు వాళ్లు చూసుకున్నారు. కానీ నితిన్ ఏమో తాను ఎంచుకున్న డేట్ వదిలేసి.. ఆల్రెడీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న వాళ్ల మీదికి వెళ్తున్నాడు.

ఇది ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’; ‘అక్షర’ సినిమాలకు ఇబ్బందికరమే. బహుశా ప్రి ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరుగుతుండొచ్చేమో, 19కి సినిమా రెడీ కాదేమో అనుకుంటున్నారు. మరి ఈ క్లాష్ విషయంలో ఎలా సర్దుబాటు చేసుకుంటారన్నది ప్రశ్నార్థకం. ఎ1 ఎక్స్‌ప్రెస్, అక్షర సినిమాలకు ఫస్ట్ కాపీలు రెడీ అయి ఉంటే వాటిని ముందు వారానికి తీసుకొచ్చే అవకాశఆలు లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.