రిలీజ్ డేట్లిచ్చారు.. ఇక రీషెడ్యూల్ చేయబోతున్నారు

ఏదో పూనకం వచ్చినట్లుగా వరుసబెట్టి కొత్త సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించారు టాలీవుడ్ నిర్మాతలు. ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా రోజుకు ఐదారు చెప్పొను వరుసబెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్లు వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో 25కు పైగానే కొత్త సినిమాల రిలీజ్ డేట్లు వెల్లడయ్యాయి. ఈ మ్యాడ్ రష్ ఏంటి బాబోయ్ అన్నట్లు ఆశ్చర్యపోయి చూశారు ప్రేక్షకులు.

ఒకరిని చూసి ఒకరు, ఆలస్యమైతే ఎక్కడ బెర్తు దొరకదో అన్నట్లు ప్రకటనలు ఇచ్చేశారు. వీరిలో చాలామందికి తమ సినిమాలను ఆ తేదీకి విడుదల చేస్తామన్న కాన్ఫిడెన్స్ లేదన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయినా సరే.. కర్చీఫ్ వేసి పెడితే పోయేదేముంది అన్నట్లు డేట్లు ప్రకటించేశారు. వేరే నిర్మాతలతో సంప్రదింపులు లేకుండా ఎవరికి వాళ్లు డేట్లు ఇచ్చేయడంతో కొన్ని పేరున్న సినిమాల మధ్య క్లాష్ అనివార్యం అయింది. ఇది మంచి సంప్రదాయం కాదని, దీని వల్ల ఎవరికీ మంచి కాదని ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.

హడావుడిగా డేట్లు ప్రకటించేశాక ఇప్పుడు తీరిగ్గా తప్పొప్పులు, ప్రతికూల పరిణామాల గురించి చర్చిస్తున్నారట టాలీవుడ్ నిర్మాతలు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతుండటంతో రిలీజ్ డేట్ల రీషెడ్యూల్ దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఆల్రెడీ నాని సినిమా ‘టక్ జగదీష్’ డేట్ మారినట్లు తెలుస్తోంది. ‘లవ్ స్టోరి’ పోటీకి రావడం, ముందు వారం ‘వకీల్ సాబ్’ రాబోతుండటంతో ఏప్రిల్ 16న విడుదల మంచిది కాదని 23వ తేదీకి సినిమాను వాయిదా వేసుకున్నారట. తన సినిమాకు ‘లవ్ స్టోరి’ని పోటీగా నిలపడం మీద ముందు నాని కినుక వహించినప్పటికీ.. వెనక్కి వెళ్లడమే తన సినిమాకు మంచిదని నిర్ణయించుకున్నాడట.

మరోవైపు మే 14న ‘నారప్ప’ రావడమూ డౌటే అంటున్నారు. ‘ఆచార్య’తో పోటీ మంచిది కాదని డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా చెప్పడంతో ముందు వారానికి కానీ, తర్వాతి వారానికి కానీ సినిమా రిలీజ్ డేట్ మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అలాగే ఏప్రిల్ 2న రావాల్సిన సీటీ మార్, 30కి అనుకున్న ‘విరాటపర్వం’ డేట్‌ల మార్పు విషయంలోనూ సమాచాలోచనలు జరుగుతున్నాయట.