ఫ్లాట్లు పంచిన హీరోయిన్

తమ దగ్గర దీర్ఘ కాలంగా పని చేసే వాళ్లకు సినీ ప్రముఖులు ఊహించని కానుకలు ఇవ్వడం మామూలే. తమిళ స్టార్ హీరో విజయ్.. తన దగ్గర చాలా ఏళ్లుగా పని చేస్తున్న వాళ్లందరికీ చెన్నై శివార్లలో ఫ్లాట్లు కట్టి ఇవ్వడం విశేషం. ఇప్పుడు బాలీవుడ్ భామ కంగనా రనౌత్.. తన కజిన్స్ అందరికీ ఛండీగఢ్‌లో లగ్జరీ ఫ్లాట్లు తీసి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

కుటుంబ సభ్యులకు ఫ్లాట్లు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముంది అనిపించొచ్చు. ఐతే రక్త సంబంధీకులే ఆస్తి పంపకాల్లో ఎలా గొడవ పడుతుంటారో.. ఒకరికి ఒకరు సాయం చేయడానికి ఎలా వెనుకాడుతుంటారో తెలిసిందే. అలాంటిది రక్త సంబంధీకులు కాని వాళ్లకు కూడా ఆమె ఫ్లాట్లు ఇస్తోంది. సొంత సోదరి రంగేలి చందేలితో పాటు తన కజిన్స్ అందరికీ ఆమె ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇచ్చింది.

కొన్ని నెలల కిందటే కంగనా కజిన్ ఒకరి పెళ్లి జరగ్గా.. ఆ పెళ్లి ఖర్చు మొత్తం కంగనానే భరించింది. ఆ మ్యారేజ్ గ్రాండియర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తన కజిన్స్ అందరికీ ఛండీగఢ్‌లో లగ్జరీ ఫ్లాట్లను ఆమె గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని గురించి మీడియాలోనూ వార్తలు రాగా.. ఓ వార్త లింక్‌పై కంగనా సైతం స్పందించింది. జనాలు తమ సంపదను తమ కుటుంబంతో పంచుకోవాలని, ఇలా చేస్తే మన ఆనందం ఎన్నో రెట్లు పెరుగుతుందని వ్యాఖ్యానించింది.

తాను బహుమతిగా ఇస్తున్నవి లగ్జరీ ఫ్లాట్లు అని, 2023కు అవి సిద్ధమవుతాయని వెల్లడించింది. కుటుంబం కోసం ఇది చేయగలిగినందుకు తానెంతో అదృష్టవంతురాలినని పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ కంగనానే అంటే ఆశ్చర్యమేమీ లేదు. ఆమె పేరు మీద లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు రూ.100 కోట్ల దాకా బిజినెస్ జరుగుతున్నపుడు ఆమె హైయెస్ట్ పెయిడ్‌గా ఉండటంలో ఆశ్చర్యమేముంది?