సోనూ సూద్ హీరో.. విశాల్ విలన్?


బాలీవుడ్లో ఓ ఆసక్తికర చిత్రానికి రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటిదాకా విలన్, క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేసిన సోనూ సూద్.. త్వరలోనే హీరో అవతారం ఎత్తుతున్నాడట. అతను హీరోగా తమిళ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై’ను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. దీనికి దర్శకుడెవరో తెలియదు. రీమేక్ హక్కులను సోనూనే కొన్నట్లు సమాచారం.

తమిళంలో విశాల్ చేసిన మిలిటరీ మ్యాన్ పాత్రలో సోనూ కనిపించనున్నాడట. ఇంకో విశేషం ఏంటంటే.. తమిళంలో అర్జున్ చేసిన విలన్ పాత్రలో విశాల్ నటిస్తాడట. ఈ రకంగా బాలీవుడ్లోకి విలన్ పాత్రతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట విశాల్. ఒక భాషలో హీరోగా నటించి, ఆ సినిమాను వేరే భాషలో తీస్తుంటే విలన్‌గా నటించడమంటే చిత్రమైన విషయమే.

ఇంతకుముందు మణిరత్నం తీసిన ‘విలన్’ సినిమా విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్ విలన్ పాత్ర పోషించాడు. కానీ హిందీలో ఇదే సినిమాలో విక్రమ్ హీరోగా చేశాడు. ఐతే ఆ సినిమా ప్రతికూల ఫలితాన్నందుకోవడం వేరే విషయం. ‘ఇరుంబు తిరై’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి ఫలితాన్నందుకుంది. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మిత్రన్ రూపొందించాడు. అతడికదే తొలి సినిమా.

‘ఇరుంబు తిరై’ హిందీ వెర్షన్లో సోనూ హీరో, విశాల్ విలన్ అని వినడానికైతే బాగుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. లాక్ డౌన్ టైంలో అనితర సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూను ఇకపై విలన్ పాత్రల్లో చూడటానికి ఇష్టపడట్లేదు. అతను కూడా హీరో పాత్రలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు హిట్ ‘క్రాక్’ రీమేక్ హక్కులను సోనూ కొన్నాడని, హిందీలో అతనే హీరోగా నటిస్తాడని కూడా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే.