హ‌ద్దులు దాటిన… పెత్త‌నం.. ఉద్యోగుల‌కే న‌ష్ట‌మా?

మేం ఎన్నిక‌ల‌కు స‌హ‌క‌రించం. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. ఎంత‌కైనా వెళ్తాం -ఇదీ తాజా ఏపీ ఉద్యోగ సంఘాల నుంచి వ‌చ్చిన స‌మాధానం. తాజాగానే కాదు.. గ‌డిచిన వారం రోజులుగా ఎన్నిక‌ల సంఘంతో ప్ర‌భుత్వానికి వివాదం ముదిరిన నాటి నుంచి కూడా ఉద్యోగులు ఏక‌ప‌క్షంగా ప్ర‌భుత్వ పాట పాడుతున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది. ఈ క్ర‌మంలో ఈ వివాదం, ఈ వ్యాఖ్య‌లు శ‌నివారం మ‌రింత ముదిరాయి. ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. గ్రామ‌స్థాయిలో కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అమ‌ల్లోకి వ‌చ్చేసిన త‌ర్వాత కూడా ఉద్యోగుల గ‌ళంలో మార్పు క‌నిపించ‌లేదు. పైగా ధిక్కార స్వ‌రం భారీగా వినిపించింది.

ఈ క్ర‌మంలో.. నిజంగానే.. ఉద్యోగుల ఇష్టం చెల్లుబాటు అవుతుందా? త‌మ ఇష్టం మేర‌కు ప‌నిచేయాల‌ని అనుకుంటే.. చేయ‌డం.. వ‌ద్దంటే.. మానుకోవ‌డ‌మేనా? పైగా రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ఎన్నిక‌ల సంఘంతో ఇలా వ్యాఖ్య‌ల దాడుల‌కు దిగే ధైర్యం ఉద్యోగుల‌కు ఏ చ‌ట్టం ప్ర‌కారం వ‌చ్చింది? వ‌ంటి అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా ఎక్కువ మంది ప్ర‌స్థావించిన విష‌యం.. త‌మిళ‌నాడులో అప్ప‌టి జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం ఉద్యోగుల‌పై తీసుకున్న చ‌ర్య‌లు.. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు.. మ‌ద్రాస్ హైకోర్టుకు వెళ్లిన త‌ర్వాత‌.. స‌ద‌రు కోర్టు చేసిన వ్యాఖ్య‌లు. కోర్టు అప్ప‌ట్లో ఏం చెప్పింది? జయ ఎలాంటి నిర్న‌యం తీసుకుంది? అనే విష‌యాలు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీశాయి.

త‌మిళ‌నాట ఉద్యోగ సంఘాలు.. సంయుక్తంగా ఏర్ప‌డి.. త‌మ డిమాండ్ల సాధ‌న కో్సం జ‌య ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచాయి. 2003 రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించిన ఉద్యోగులు .. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విదుల‌ను బ‌హిష్క‌రించాయి. దీంతో అప్ప‌టికే ప‌లు ద‌ఫాల చ‌ర్చ‌లు చేసిన జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం.. చివ‌ర‌కు వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ.. రాత్రికిరాత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారంతా మూకుమ్మ‌డిగా హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ సంద‌ర్భంగా విచారించిన హైకోర్టు.. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు పేర్కొంది. ఉద్యోగుల‌కు స‌మ్మె చేసే హ‌క్కు ఉన్నా.. ముంద‌స్తు నిర్ణ‌యం మేర‌కు.. చేయాలి త‌ప్ప‌.. మూకుమ్మ‌డిగా స‌మ్మె చేసే హ‌క్కులేద‌ని పేర్కొంది.

పైగా అత్య‌వ‌స‌ర విధుల చ‌ట్టాన్ని ధిక్క‌రించ‌డం(ఎస్మా) మ‌రింత నేర‌మ‌ని పేర్కొంది. పైగా ప్ర‌భుత్వం అంటే.. ప్ర‌జ‌లేన‌ని.. ప్ర‌జ‌ల సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటే.. సేవ చేసేందుకు విముఖ‌త వ్య‌క్తం చేయ‌డాన్ని కోర్టు తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది. అయితే.. ప్ర‌భుత్వం కూడా ముంద‌స్తు నోటీసు ఇవ్వ‌కుండా ఒక్క‌సారిగా డిస్మిస్ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టిన కోర్టు.. ఉద్యోగులు ఇక‌పై ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగ‌బోమ‌ని హామీ ప‌త్రాలు స‌మ‌ర్పించిన త‌ర్వాతే.. వారిపై ఉన్న డిస్మిస్ ఆర్డ‌ర్‌ను ఎత్తేయాల‌ని తీర్పు చెప్పింది. అంటే.. ఉద్యోగులు ఎవ‌రైనా.. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప్ర‌భుత్వం పై క‌త్తిదూసేందుకు ఎట్టిప‌రిస్థితిలో అర్హులు కార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ నేరుగా రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ఎన్నిక‌ల క‌మిష‌న్ పై తిరుగుబాటు బావుటా ఎగ‌రేయ‌డం అంటే.. ఇది మ‌రింత పెద్ద నేర‌మ‌ని.. మాజీ ఐఏఎస్‌లు.. ఐవైఆర్ కృష్నారావు, ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం వంటివారు కూడా చెబుతున్నారు. ప్ర‌భుత్వాలు ఉంటాయి.. పోతాయి.. కానీ, ఉద్యోగులు అన్ని ప్ర‌భుత్వాల్లోనూ ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంది. అలాంటి వారికి ఉన్న హ‌క్కులు కేవ‌లం.. ప‌నిచేస్తూ.. న్యాయ బ‌ద్ధ‌మైన హ‌క్కులు సాధించుకోవ‌డ‌మే! కానీ, ఇప్పుడు ఏపీ ఉద్యోగులు చేస్తున్న‌ది మితిమీరిన ధిక్కారం అనే చ‌ర్చ సాగుతోంది. అంతిమంగా.. వీరి నిర్ణ‌యాన్ని ఏ కోర్టూ స‌హించే, భ‌రించే ప‌రిస్థితి ఉండ‌దు. ఈ పోక‌డ‌.. మంచిదికాద‌ని రాజ్యాంగ నిపుణులు సైతం సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం.