ప్రభాస్ పెళ్లిపై ఆయన విసిగిపోయారా?

ప్రభాస్ పెళ్లి ఒక ఎడతెగని వ్యవహారంలా మారిపోయింది చాలా కాలంగా. దాదాపు పదేళ్ల నుంచి అతడి పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. ‘డార్లింగ్’ టైంలోనే అతడి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. అవి అంతకంతకూ పెరుగుతూ వెళ్లాయి. ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ప్రభాస్ పేరును ముడిపెట్టి అతడి పెళ్లి గురించి ప్రచారాలు సాగించారు. ఆ తర్వాత సినిమాలతో సంబంధం లేని వేరే అమ్మాయితో పెళ్లి అంటూ.. ఎప్పటికప్పుడు కొత్త పుకార్లు పుడుతూనే ఉన్నాయి.

‘బాహుబలి’ చేస్తున్న సమయంలో.. ఆ చిత్రం పూర్తి కాగానే ప్రభాస్ పెళ్లి అన్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా ఇదే మాట చెప్పారు. ఆ సినిమా అయ్యాకేమో ‘సాహో’ అయ్యాక పెళ్లి అన్నారు. కృష్ణం రాజు కూడా ఈ రకంగానే సంకేతాలు ఇచ్చారు. కానీ ప్రభాస్ ఆ రెండు చిత్రాలనూ పూర్తి చేసి.. ‘రాధేశ్యామ్’ను కూడా చివరి దశకు తీసుకొచ్చాడు. కొత్తగా ఇంకో మూడు సిినిమాలను లైన్లో పెట్టాడు. వాటి కోసం విరామం లేకుండా పని చేయబోతున్నాడు.

ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పుడు చర్చే లేకుండా పోయింది. అభిమానులు సైతం ఈ విషయంలో డిస్కషన్లు పెట్టడం మానేశారు. ఇలాంటి తరుణంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి అడిగితే.. ఆయన ఒకింత అసహనంతోనే స్పందించారు. ‘‘ప్రభాస్ పెళ్లి జరిగినపుడు జరుగుతుంది’’ అంటూ ఆయన నవ్వేసి ఊరుకున్నారు.

ఇంతకుమించి ఈ విషయంలో మాట్లాడ్డానికి ఏమీ లేదు అన్నట్లుగా ఆయన స్పందించారు. దీన్ని బట్టి చూస్తే పెళ్లి విషయంలో ప్రభాస్ తీరుతో కృష్ణం రాజు విసిగిపోయినట్లు అనిపిస్తోంది. ఇక అతను ఎప్పుడు చేసుకుంటానంటే అప్పుడు పెళ్లి చేద్దాం అని ఆయన ఊరుకుండిపోయారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు తనకు తమిళనాడు గవర్నర్‌ పోస్ట్ దక్కనున్నట్లుగా జరుగుతున్న ప్రచారం మీదా కృష్ణం రాజు స్పందించారు. ఊరికే ఇలాంటి ప్రచారాలు సాగించడం సరి కాదని.. తనకైతే బీజేపీ అధిష్ఠానం నుంచి ఈ దిశగా పిలుపేమీ రాలేదని.. ఏదైనా ఉంటే కచ్చితంగా మీడియాకు చెబుతానని ఆయన అన్నారు.