సోనూసూద్ పాత నేరస్తుడు.. ఈ మాటలు చెప్పిందెవరో తెలుసా?

అనుకోవాలే కానీ.. కొన్ని వ్యవస్థలకు తమకు నచ్చినప్పుడు.. నచ్చిన రీతిలో మాట్లాడేసే అద్భుత అవకాశం మన దేశంలో ఉంటుంది. లాక్ డౌన్ వేళ.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి.. తన సొంత డబ్బును మంచినీళ్ల మాదిరి ఖర్చు చేస్తూ సహాయ సహకారాలు అందించిన నటుడు సోనూసూద్ గురించి గతంలో తెలీదేమో కానీ.. ఇప్పటికైతే ప్రజలందరికి తెలిసిందే. అలాంటి వ్యక్తిని పట్టుకొని.. నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసింది బాధ్యతాయుత స్థానంలో ఉన్న ముంబయి నగర పాలక సంస్థ.

తనకు నచ్చకుంటే చాలు.. ఎవరినైనా సరే.. ఇట్టే శిక్షించే టాలెంట్ ఉన్న సంస్థగా పేర్కొన్న ముంబయి నగర పాలక సంస్థ.. తాజాగా సోనూసూద్ పై అతి వ్యాఖ్యలు చేసింది. జుహూలో ఆయన ఉండే నివాసం అనధికారిక కట్టడంగా పేర్కొంటూ నగర పాలక సంస్థ నోటీసులు పంపింది. దీన్ని కోర్టులో సవాలు చేశారు. దీనిపై సమాదానం ఇవ్వాల్సిందిగా కోర్టు ముంబయి నగర పాలక సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో సోనూసూద్ తన ఇంటిని అక్రమ నిర్మాణం చేశారని.. ఇప్పటికే రెండుసార్లు కూల్చినా.. ఆయన తన పద్దతి మార్చుకోలేదని.. అతడో పాత నేరగాడిగా అభివర్ణించింది.

నగరపాలక సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్ సంచలనంగా మారింది. తాను సంపాదించిన కోట్లాది రూపాయిల్ని ఖర్చు చేస్తూ సహాయక చర్యల్లో ముందుండే సోనూకు.. అక్రమ నిర్మాణాల్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఏమిటి? సాయం చేసే డబ్బుతో మరింత విలాసవంతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఒకవేళ.. ఆయన చేపట్టిన అక్రమ నిర్మాణం మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి.. నోటీసులు ఇవ్వటం.. వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేయటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.

నిజంగానే సోనూసూద్ తప్పు చేశాడే అనుకుందాం. ముంబయి మహా నగరంలో అక్రమ కట్టడం ఒక్కటి కూడా లేదా? సామాన్యుల సంగతి వదిలేద్దాం. ప్రజాప్రతినిదుల భవనాల్నే చూస్తే.. అక్రమ నిర్మాణాలు.. నిబంధనలకు విరుద్దంగా కొంత నిర్మాణం జరిగిన కట్టడాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేవా? అన్నది ప్రశ్న. అలాంటప్పుడు అందరిపైనా చర్యలు తీసుకోని ముంబయి మహా పాలక సంస్థ.. సోనూసూద్ లాంటి వ్యక్తికి నోటీసులు జారీ చేయటమే కాదు.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

పాత నేరగాడు అన్నంతనే మరెలాంటి నేరం చేశారా? అన్న సందేహం కలుగుతుంది. తీరా చూస్తే.. ఇంటి నిర్మాణంలో నిబంధనలకు తగ్గట్లుగా కట్టలేదన్న విషయం బయటకు వస్తుంది. ఇదంతా చూసినప్పుడు.. ముంబయి మహా పాలక సంస్థ.. తన నోటీసులతో ఎవరినైనా సరే.. వారి ఇమేజ్ ను ఇట్టే డ్యామేజ్ చేసే సత్తా ఉందని చెప్పక తప్పదు.