ఆస్ట్రేలియా క్రికెటర్లను ఛీకొట్టేది ఇందుకే..

ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకున్నంత చెడ్డ పేరు ఇంకెవ్వరికీ ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యర్థులను మాటలతో దూషించడం.. ఏదో ఒక వివాదంలో వేలు పెట్టడం.. గెలుపు కోసం వక్ర మార్గాలు ప్రయత్నించడం.. ఇలా మైదానంలో ఏం చేయకూడదో అన్నీ చేస్తుంటారు.

అప్పట్లో ఒక మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్ బాదితే అవతలి జట్టు గెలిచే స్థితిలో ఉంటే బౌలర్‌‌తో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయించి గెలిచిన చరిత్ర ఆస్ట్రేలియాది. ఇక కొన్నేళ్ల కిందటే బాల్ టాంపరింగ్ వివాదం ఆ జట్టును ఎంతగా అప్రతిష్ట పాలు చేసిందో తెలిసిందే.
ఆ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఉండి ఏడాది నిషేధం కూడా ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్.. ఆ ఉదంతం తర్వాత మారిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అతను ఒక నీచపు పని చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టులో భారత్ ముందు 407 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఓటమి తప్పించుకోవడం అసాధారణంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో మూడో వికెట్ రూపంలో రహానె ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్. అతను అనూహ్యంగా చెలరేగి ఆడి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించాడు. అతను 97 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఐతే పంత్ బ్యాటింగ్ చేస్తుండగా అతణ్ని దెబ్బ తీయడం కోసం స్మిత్ చేసిన పని స్టంప్ కెమెరాకు చిక్కింది. పంత్ డ్రింక్స్ తీసుకుంటున్నపుడు క్రీజు దగ్గరికి వచ్చిన స్మిత్.. అతడి గార్డ్ మార్క్స్‌ను షూలతో చెరిపేశాడు. తర్వాత పంత్ వచ్చి మళ్లీ గార్డ్ మార్క్స్‌ పెట్టుకోవాల్సి వచ్చింది.

స్టంప్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యం కామెంటేటర్ల దృష్టిలో పడి స్మిత్‌ పై విమర్శలు గుప్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్మిత్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. షేమ్ ఆన్ యు స్మిత్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అతడి తీరును దుయ్యబడుతున్నారు.