వేసవిలో ప్రేక్షకులకు ఊపిరాడనిచ్చేలా లేరు

2020లో సినీ ప్రియులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. వారం వారం థియేటర్లకు వెళ్లి కొత్త సినిమాలు చూడటం అలవాటైన వారికి 2020లో ఏమీ పాలు పోలేదు. అటు ఇటుగా రెండు మూడు నెలలు తప్ప సినిమాల ప్రదర్శనే లేదు. దీనికంతటికీ కరోనానే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలెన్నో రిలీజ్ కాకుండా ఆగిపోయాయి.

వాటికి తోడు ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న, త్వరలో పూర్తి కానున్న సినిమాలన్నీ 2021లో బాక్సాఫీస్ మీద దాడికి దిగుతున్నాయి. ఆల్రెడీ సంక్రాంతికి నాలుగు పేరున్న సినిమాలు విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెలలో మరికొన్ని చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలంటే మామూలుగా అన్ సీజన్‌గా పరిగణిస్తారు. ఆ నెలల్లో కూడా సినిమాల విడుదల ఉంటుంది కానీ.. పెద్ద సినిమాల కళ తక్కువే.

కానీ ఈ ఏడాది వేసవికి మాత్ర కొత్త సినిమాల మోత మామూలుగా ఉండేలా లేదు. అందులోనూ క్రేజీ, భారీ చిత్రాలు వరుస కట్టేయబోతున్నాయి. మార్చి నెలాఖర్లోనే రంగ్ దె, అరణ్య సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఆ రెండు చిత్రాలూ మార్చి 26నే విడుదల కానున్నాయి. ఏప్రిల్ 9కి ‘వకీల్ సాబ్’ ఫిక్సయినట్లు చెబుతున్నారు.

2021లో విడుదలయ్యే తొలి పెద్ద హీరో సినిమా ఇదే. పవన్ కళ్యాణ్‌కిది రీఎంట్రీ మూవీ కూడా కావడంతో బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం. వకీల్ సాబ్ సందడి తగ్గకముందే.. వారానికే నాని చిత్రం ‘టక్ జగదీష్’ రానుంది. ఆ సినిమాకు ఏప్రిల్ 16న రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక ఏప్రిల్ నెలాఖర్లో ప్రభాస్ భారీ చిత్రం ‘రాధేశ్యామ్’ వస్తుందని అంటున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక మే నెలలో మరో భారీ చిత్రం ‘ఆచార్య’ విడుదలవుతుందంటున్నారు. చిరంజీవి, కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. కుదిరితే వేసవి చివర్లో బాలయ్య-బోయపాటి చిత్రం.. అల్లు అర్జున్-సుకుమార్‌ల ‘పుష్ప’ సైతం విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి వేసవిలో భారీ చిత్రాల మోత మోగడం.. ప్రేక్షకులు ఈ వినోదంలో ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయంగా కనిపిస్తోంది.