పవన్ సినిమా.. లాంఛనం ముగిసింది

ఎప్పుడో ఏడాది కిందట మొదలైన సినిమా ‘వకీల్ సాబ్’. ఇది రీమేక్ మూవీ. పక్కా స్క్రిప్టుతో షూటింగ్‌లోకి అడుగు పెట్టారు. మరీ భారీతనం ఉన్న సినిమా ఏమీ కాదు. లొకేషన్లు కూడా తక్కువ. కోర్ట్ రూంలోనే దాదాపు సగం సినిమా నడుస్తుంది. పవన్ అటు ఇటుగా నెల రోజుల డేట్లు ఈ సినిమాకు కేటాయించారు. ఆ డేట్లను కూడా రెండు నెలల వ్యవధిలోనే వాడుకోవాలని షరతు పెట్టారు. మిగతా సన్నివేశాల చిత్రీకరణకు నెలా నెలన్నర సమయం పట్టినా.. సినిమాను నాలుగు నెలల్లోపు పూర్తి చేసేయాలన్నది ప్రణాళిక. 2019 చివర్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లగా.. ఫిబ్రవరికి చాలా వరకు సినిమా పూర్తయింది కూడా. దీంతో మార్చి-ఏప్రిల్ నెలల మధ్యలో చిత్రీకరణ పూర్తవుతుంది.. మే 15కు సినిమా థియేటర్లలో దిగుతుంది.. ఇక రచ్చో రచ్చస్యనే అని పవర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. కానీ అనూహ్యంగా కరోనా వచ్చి బ్రేక్ వేసింది.

లాక్ డౌన్ తర్వాత పవన్ లేకుండానే సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. అక్టోబరులో పవన్ కూడా షూటింగ్‌లోకి అడుగుపెట్టేశాడు. రెండు వారాల కిందటే పవన్ పాత్రతో ముడిపడ్డ అన్ని సన్నివేశాలనూ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా నుంచి పవన్ రిలీవ్ అయిపోయాడు. మిగతా సన్నివేశాలను కొన్ని రోజుల్లోనే పూర్తి చేసేశారు. మొత్తంగా టాకీ పార్ట్ పూర్తయిన విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ శనివారం ట్విట్టర్లో వెల్లడించింది. ఇక తాము పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్తున్నట్లు ప్రకటించింది. ఆ పనులతో పాటే టీజర్ వర్క్ కూడా నడుస్తోంది. సంక్రాంతి కానుకగా ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 14న సాయంత్రం 6.03 గంటలకు టీజర్ రాబోతోంది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయాలన్నది దిల్ రాజు ప్లాన్.