అంద‌రి చూపు మార‌టోరియంపై నే

అప్పు తీసుకున్న వారికి ఓ శుభ‌వార్త‌. అప్పు విష‌యంలో ఆందోళ‌న ప‌డ‌కండి. చెల్లించడంలో స‌మ‌స్య‌లు ఉంటే… మీకు క‌లిసి వ‌చ్చే వార్త‌. కానీ సాంకేతికంగా చూస్తే ఒకింత స‌మ‌స్య‌ను సృష్టించేదే. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… రుణాల చెల్లింపులపై మరో 3 నెలలపాటు మారటోరియంను ఆర్బీఐ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో మారటోరియంను సైతం అదే రీతిలో పెంచాలన్న ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ గట్టిగా పరిశీలిస్తోంది. దీంతో రుణ‌గ్ర‌హీత‌ల‌కు ఒత్తిడి త‌గ్గిన‌ట్లే.

కరోనా వైరస్‌ కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. దీంతో అన్ని రకాల రుణాలపై ఈఎంఐ చెల్లింపులకు సంబంధించి మూడు నెలల వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల ఈఎంఐలపై మారటోరియం తీసుకునే వీలును రుణగ్రహీతలకు కల్పించాలని బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మార్చి 27న ఆర్బీఐ సూచించింది.

అయితే, ఈ నెల 31తో ఈ గడువు తీరిపోతోంది. ఇదే స‌మ‌యంలో లాక్ డౌన్‌ను ఇటీవలే ఈ నెల 17దాకా కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది. దీంతో అంద‌రి చూపు మార‌టోరియంపై ప‌డింది. భారతీయ బ్యాంకుల సంఘం సహా వివిధ వర్గాల నుంచి మారటోరియంను పొడిగించాలన్న విజ్ఞప్తులు ఆర్బీఐకి వస్తున్నాయి.

దీంతో మార‌టోరియం పొడ‌గింపు అంశాన్ని ఆర్బీఐ చురుగ్గా పరిశీలిస్తోంది. మారటోరియంను పెంచితే జూన్‌, జూలై, ఆగస్టు నెలల ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాలను బ్యాంకులు తర్వాతి కాలంలో వసూలు చేసుకుంటాయి.

అయితే, ఈఎంఐలను వాయిదా వేసుకోవడం వల్ల రుణగ్రహీతలకు లాభమేమీ ఉండదని బ్యాంకర్లు అంటున్నారు. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత ఈ మూడు నెలల విరామ కాలానికి వడ్డీ లెక్కించి వేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇదే బాట‌లో మ‌రిన్ని బ్యాంకులు సైతం ప్ర‌క‌ట‌న‌లు కురిపించాయి.