వైట్ హౌస్ పై ట్రంప్ కొత్త పేచీ

ఎట్టి పరిస్దితుల్లోను వైట్ హౌస్ ను వదిలిపెట్టేది లేదని అవుట్ గోయింగ్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పేచీ మొదలుపెట్టారు. ఈమధ్యనే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంపు ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఓటమి ఖాయమైన రోజు నుండి రోజుకో కొత్త సమస్యను ట్రంప్ తెరమీదకు తీసుకొస్తున్నారు. బైడెన్ ను తాను అధ్యక్షునిగానే గుర్తించనంటూ తెగేసిచెప్పారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి రోజుకో మాట మారుస్తు ట్రంప్ యావత్ ప్రపంచంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకసారి గెలిచిన బైడెన్ కు శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత రోజు బైడెన్ గెలుపును తాను అంగీకరించేది లేదని తెగేసిచెప్పారు. తర్వాత బైడెన్ గెలుపుపై కోర్టుల్లో కేసులు వేయించారు. మరోరోజు బైడెన్ కు వచ్చిన ఓట్లను తప్పుపట్టారు. చివరకు వైట్ హౌస్ ను తాను ఖాళీ చేసేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు.

ఇపుడేమో ఎట్టి పరిస్దితుల్లోను వైట్ హౌస్ ను వదిలిపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. అసలు అధ్యక్ష ఎన్నికను కూడా రద్దు చేయాలంటు కొత్త డిమాండ్ అందుకున్నారు. అయితే దీనిపై అమెరికా మొత్తం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. డెమక్రాట్ల నుండే కాక సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు, మద్దతుదారుల్లో కూడా ట్రంప్ వైఖరిపై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఎన్నికలను రద్దు చేయటమంటే యావత్ ప్రపంచంలో అమెరికాను నవ్వులపాల్జేయటమే అనే అభిప్రాయం పెరిగిపోతోంది.

ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలు పూర్తియిన దగ్గర నుండి జరుగుతున్న పరిణామాలతో ప్రపంచం ముందు అమెరికా పరువుపోయింది. పరువు మరింతగా దిగజారిపోకముందే ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేయాలంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ట్రంప్ పై బైడెన్ కూడా మండిపోతున్నారు. ట్రంప్ కు మతిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ ఈనెల 20వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఒకవైపు బాధ్యతలు తీసుకునే తేదీ దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్ కొత్త రకం పేచీలను తీసుకొస్తుండటం అందరిలోను చికాకులు పెంచేస్తోంది. అధ్యక్ష ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రపంచం ముందు గతంలో ఎప్పుడు కూడా ఇంతగా నవ్వుల పాలు కాలేదని అమెరికా జనాలే చెప్పుకుంటున్నారు. ఇదే విషయమై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ ట్రంప్ వ్యవహారం అమెరిక మూలసూత్రాలకే గొడ్డలిపెట్టుగా అభివర్ణించటం గమార్హం.