ఫాంలోకొచ్చిన తెలుమ్మాయికి ‘సమ్మతమే’


సినిమాలు మాత్రమే ఫాలో అయ్యే వాళ్లకు చాందిని చౌదరి గురించి కొన్ని నెలల ముందు వరకు పెద్దగా తెలియదు. ఆమె యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌లోకి ఎంటరై దాదాపు దశాబ్దం కావస్తోంది. అందులో ‘మధురం’ సహా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌లో అందం, అభినయంతో ఆకట్టుకుని వాటిని ఫాలో అయ్యే ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ సినిమాల్లో మాత్రం ఆమెకు బ్రేక్ రావడానికి చాలా టైం పట్టేసింది.

గత ఏడెనిమిదేళ్లలో ఆమె నటించిన ఏ సినిమా కూడా విజయవంతం కాలేదు. హీరోయిన్‌గానే కాక క్యారెక్టర్ రోల్స్‌ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఎట్టకేలకు ‘కలర్ ఫోటో’ సినిమా ఆమె కోరుకున్న ఫలితాన్నందించింది. రిలీజైంది ఓటీటీలోనే కానీ.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇన్నేళ్లలో చాందిని సంపాదించిన గుర్తింపంతా ఒకెత్తయితే.. ఈ సినిమాతో సాధించిన పాపులారిటీ మరో ఎత్తు.

ఈ సినిమా తర్వాత తన కెరీర్ మారుతుందని చాందిని ఆశిస్తోంది. ఐతే పెద్ద ఛాన్సులైతే ఇంకా ఏవీ మొదలు కాలేదు కానీ.. చాందిని కథానాయికగా ఓ కొత్త సినిమా మాత్రం మొదలైంది. ఆ సినిమా పేరు.. సమ్మతమే. ‘రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి మంచి పేరు సంపాదించిన కిరణ్ అబ్బవరం ఇందులో హీరో.

‘లవ్ ఈజ్ అన్ కండిషనల్’ అన్న ట్యాగ్‌తో వస్తున్న ఈ చిత్రంతో గోపీనాథ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. టైటిల్, దాని లోగో ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే కలిగిస్తున్నాయి. ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీలా కనిపిస్తోందీ చిత్రం. యుజి ప్రొడక్షన్స్ అనే కొత్త బేనర్‌పై ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘సమ్మతమే’ త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. మరి ఈ సినిమాతో చాందిని మరో హిట్ కొట్టి టాలీవుడ్లో మరింత బిజీ అవుతుందేమో చూడాలి. ఆమె కథానాయికగా మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.