కేసీయార్ మీద బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసిందా ?

‘టిఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎంఎల్ఏలు మాతో టచ్ లో ఉన్నారు’ ..ఇది తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఇందులో నిజమెంతన్నది పక్కన పెట్టేద్దాం. మరంత మంది ఎంఎల్ఏలు నిజంగానే తమతో టచ్ లో ఉంటే మరెందుకని వాళ్ళందరినీ టోకుగా చేర్చేసుకోవటం లేదు ? ఎందుకనంటే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదనే ఆగుతున్నామని కతలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారపార్టీకి చెందిన ఎంఎల్ఏలను, ఎంపిలను లాగేసుకుంటున్న విషయం పాపం బండికి ఇంకా తెలీలేదేమో.

మొన్నటికి మొన్న మిత్రపక్షమని కూడా చూడకుండా అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయుకి చెందిన ఏడుగురు ఎంఎల్ఏల్లో ఆరుగురిని బీజేపీలోకి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు పశ్చిమబెంగాల్లో ఓ ఎంపి+నలుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్ఏలను బీజేపీలోకి లాగేసుకున్న విషయం దేశమంతా చూసింది. ఇక మధ్యప్రదేశ్, కర్నాటక, అంతకుముందు గోవా, సిక్కిం, మణిపూర్ లో కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఎలా లొంగదీసుకున్నారో అందరికీ తెలిసిందే. రాజస్ధాన్ లో కూడా కాంగ్రెస్ ఎంఎల్ఏలను లొంగదీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రి అశోగ్ గెహ్లాత్ మొత్తకుంటున్నన విషయం తెలిసిందే.

ఇన్ని రాష్ట్రాల్లో అడ్డురాని రాజ్యాంగం కేవలం ఒక్క తెలంగాణాలో మాత్రమే అడ్డుపడుతోందా ? రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చూస్తున్నట్లు బండి చెబుతున్నది చూస్తుంటే పై ప్రాంతాల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా తమపార్టీ నేతలు నడుకుకుంటున్నారని అంగీకరిస్తున్నట్లే కదా. సరే ఇక తెలంగాణా సంగతే తీసుకుంటే 30 మంది ఎంఎల్ఏలు అసలు బీజేపీతో ఎందుకు టచ్ లోకి వెళతారు ? టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళితే వచ్చే ఉపయోగం ఏమిటి ? 30 మంది ఎంఎల్ఏలు బీజేపీలోకి వెళ్ళినంత మాత్రాన కమలంపార్టీ ఏమీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదే.

ఇంతచిన్న విషయం టీఆర్ఎస్ ఎంఎల్ఏలకు తెలీకుండానే ఉంటుందా ? కేసీయార్ మీద మైండ్ గేమ్ ఆడేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. ఇటువంటి మైండ్ గేమ్ లు కేసీయార్ కు కొత్తా కాదు తెలీంది కాదు. బండి లాంటి నేతలను కేసీయార్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందినే చూసుంటారు. బండి చేసిన ప్రకటనతో కేసీయార్ టెన్షన్ పడిపోయి కిందా మీద పడేది కూడా ఏమీ ఉండదు. ఏదో బండి చెప్పారు..మీడియా ప్రచురించిందంతే. మహా అయితే ఏమవుతుందంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసే అవకాశం రానివాళ్ళు బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశం దక్కించుకోవచ్చంతే.