భారతీయులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ ఇండియాలో అతి త్వరలోనే మొదలు కాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలవడానికి 2021 మార్చి వరకు ఎదురు చూడాల్సిందే అని ఇంతకుముందు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు కానీ.. అందుకు రెండు నెలల ముందే వ్యాక్సినేషన్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే విదేశాల్లో ఆమోదం పొందిన ఆక్స‌్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు ఇండియాలోనూ అనుమతలు లభించగా.. ఒక్క రోజు వ్యవధిలోనే దేశీయంగా తయారైన ‘కోవాగ్జిన్’కు సైతం అనుమతులు వచ్చేశాయి. ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రై రన్ కూడా మొదలుపెట్టేశారు. ఇంకొన్ని రోజుల్లో వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి టీకా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత సామాన్యులకు వ్యాక్సినేషన్ ఆరంభమవుతుంది.

ఐతే ఈ వ్యాక్సిన్లను అందరికీ ఉచితంగా వేస్తారా లేదా అనే విషయంలో సందేహాలున్నాయి. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుందని.. మిగతా వాళ్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని.. ప్రైవేటుగా ఏర్పాటు చేసే వ్యాక్సిన్ కేంద్రాల్లోనూ డబ్బులు పెట్టి టీకా వేయించుకోవాల్సి ఉంటుందని.. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఐతే కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఈ ప్రచారానికి తెరదించారు. భారతీయులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను పరిశీలించిన సందర్భంగా మంత్రిని.. విలేకరులు ఓ ప్రశ్న వేశారు. ఢిల్లీలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారా అని అడిగితే.. ఢిల్లీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా టీకా ఉచితమేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారంటే.. దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాటే. ఇందుకోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావచ్చు.