‘శాకుంతలం’లో సమంత.. ఒక ఆసక్తికర చర్చ

మొత్తానికి సస్పెన్స్ వీడిపోయింది. ‘రుద్రమదేవి’ తర్వాత సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తీయబోయే ‘శాకుంతలం’లో లీడ్ రోల్ చేయబోయేది సమంత అని తేలిపోయింది. ఈ పాత్రకు ముందు ప్రధానంగా వినిపించిన పేరు.. పూజా హెగ్డేదే. శకుంతల పాత్ర అంటే ఒక అందాల రాశి అయ్యుండాలి. అలాగే ఆ కథానాయికలో ఒక గ్రేస్ ఉండాలి. మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ అయితే సినిమాకు క్రేజ్ వస్తుంది.

వీటిని దృష్టిలో ఉంచుకుని పూజా హెగ్డేను ఈ పాత్రకు తీసుకుందామని గుణశేఖర్ గట్టి ప్రయత్నమే చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ మాంచి డిమాండ్లో ఉన్న పూజా.. ఈ దశలో ఇలాంటి రిస్కీ ప్రాజెక్టు ఎందుకని ఆగిపోయిందని గుసగుసలు వినిపించాయి. పూజా కాదన్న పాత్రను సమంత ఓకే చేసింది అనగానే ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఆ మధ్య సమంత సినిమా ‘మజిలీ’ టీవీలో చూస్తూ.. ఒక ఫొటో తీసి, సమంతనుద్దేశించి ‘ఈమె అందంగా ఉందా’ అని పూజా ప్రశ్నిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దాని మీద సమంత, అక్కినేని అభిమానులు ఫైర్ అయిపోయారు. ఐతే తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది పూజా. కానీ ఆమె కావాలనే ఇలా చేసిందనే అనుమానాలు సమంత అభిమానుల్లో ఉన్నాయి. సమంతను కూడా ఈ వ్యాఖ్య హర్ట్ చేసే ఉండొచ్చన్న సందేహాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పూజా వద్దన్న పాత్రను సమంత ఓకే చేసిందనేసరికి.. దీనిపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. పూజా మీద నిజంగా సమంతకు కోపం ఉందా.. ఆ నేపథ్యంలోనే కసితో ఈ సినిమా ఒప్పుకుందా.. గుణశేఖర్ కూడా కావాలనే సమంతను సంప్రదించాడా అనే చర్చ నడుస్తోంది. ఆ సంగతలా వదిలేస్తే.. రొమాంటిక్ టచ్ ఉన్న ‘శాకుంతలం’ సినిమాలో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరం. ఇక సమంత ఈ పాత్ర డిమాండ్ చేసేంత గ్లామరస్‌గా కనిపించగలదా అన్నది సందేహం.