చిత్తూరు జిల్లాపై త‌మిళుల ఎటాక్

మ‌ద్యం దుకాణాలు మ‌ళ్లీ తెరుచుకోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా వాటి ముందు మందు బాబులు ఎలా బారులు తీరుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఐతే కొన్ని చోట్ల మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ మ‌ద్యం కొంటుండ‌టంతో ఇబ్బందేమీ లేన‌ట్లే క‌నిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల మాత్రం మాస్కుల్లేకుండా గుంపులు గుంపులుగా ఒక‌రి మీద ఒక‌రు ప‌డి తోసుకుంటూ మ‌ద్యం కోసం ఎగ‌బ‌డుతున్న దృశ్యాలే ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల ఇలాంటి దృశ్యాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అయితే ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా క‌నిపిస్తున్నాయి. కుప్ప‌లం, న‌గ‌రి త‌దిత‌ర ప్రాంతాల్లో వంద‌లు వేల‌మంది చాలా త‌క్కువ ప్ర‌దేశంలో గుమిగూడి మీద ప‌డి తోసుకుంటుండ‌టం.. పోలీసులు వారిని ఎంత‌మాత్రం నియంత్రించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

చిత్తూరు జిల్లాలో ఇలా ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌డానికి త‌మిళులే కార‌ణం అని తెలుస్తోంది. త‌మిళ‌నాట ఇంకా మ‌ద్యం దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో బార్డ‌ర్ దాటి చిత్తూరు జిల్లాకు వేల‌మంది వ‌చ్చారు. జిల్లాలో ఉన్న మందు బాబుల‌కు వాళ్లు కూడా తోడ‌వ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. న‌గ‌రిలో అయితే దృశ్యాలు మ‌రీ భ‌య‌పెట్టేలా ఉన్నాయి. ప‌ల్లెటూరి ప్రాంతం కావ‌డంతో పోలీసులు అక్క‌డ పెద్ద‌గా దృష్టిసారించిన‌ట్లు లేరు. శ్రీకాళ‌హ‌స్తి మిన‌హాయిస్తే చిత్తూరు జిల్లాలో క‌రోనా అదుపులోనే ఉంది. కానీ త‌మిళ‌నాట భారీగా కేసులున్నాయి. అక్క‌డి వాళ్లు ఇలా వ‌చ్చి చిత్తూరు వాళ్ల‌పై ప‌డ‌టంతో క‌రోనా ప్ర‌భావం ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి మ‌ళ్లీ మ‌ద్యం దుకాణాలు తెర‌వాల‌న్న నిర్ణ‌యం డిజాస్ట‌ర్ అయ్యేట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైన్ షాపుల పుణ్య‌మా అని క‌రోనా వ్యాప్తి విశృంఖ‌ల స్థాయికి చేరుతుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.