మోడీ నోట విశాఖ కుర్రాడి మాట.. ఎవరీ వెంకట మురళీ ప్రసాద్?

ప్రధాని మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్. తన మనసులోని మాటల్ని చెప్పేందుకు మోడీ ఎంచుకున్న ఈ కార్యక్రమంలో.. ఆయన తన వరకు వచ్చిన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. తాజాగా నిర్వహించిన మన్ కీ బాత్ లో.. విశాఖ పట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్ అనే విశాఖ యువకుడి ప్రస్తావనను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఆయన ఆలోచనను మోడీ ప్రశంసించారు. అంతేకాదు.. దేశ ప్రజలతో ఆయన ఆలోచనల్నివివరంగా వెల్లడించారు.

ఇంతకీ వెంకట మురళీ ప్రసాద్ ఎవరు? ఈ విశాఖ యువకుడు ఏం చేస్తుంటారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. విశాఖపట్నంలోని గాజువాక లో నివసిస్తుంటారు. అక్కడి ఆటోనగర్ లో అతని నివాసం. ఇంతకూ ఆ యువకుడు చేసిందేమంటే.. ప్రధానికి ‘ఏబీసీ 2021’ అంటూ తన ప్రతిపాదనను పంపారు.

ఇదే విషయాన్ని మోడీ ప్రస్తావిస్తూ.. తనకు వచ్చిన ఏబీసీ 2021 చార్ట్ అన్నంతనే అర్థం కాలేదని.. దాన్ని పరిశీలించి చూడగా.. ‘ఆత్మ నిర్భర్ భారత్ చార్ట్’ అని అర్థమైంది. ఆయన తన ఇంట్లో రోజువారీగా వాడే వస్తువుల జాబితాను రూపొందించారు. వాటిల్లో భారత్ లో తయారైన వాటినే ఎక్కువగా ఉపయోగించాలని తీర్మానించుకున్నట్లు తెలిపారు. ఏటా మీరంతా కొత్త ఏడాది కోసం ఏదో ఒక తీర్మానం చేసుకుంటూనే ఉంటారు. ఈసారి మాత్రం దేశం కోసం చేయండి. దేశీయ వస్తువుల్నే వినియోగిస్తామని తీర్మానించుకోండి. వినియోగదారులు కూడా మేడిన్ ఇండియా వస్తువులనే డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆలోచన ధోరణిలో వచ్చిన భారీ మార్పు’’ అన్న మోడీ.. వెంటక మురళీ ప్రసాద్ చొరవను ప్రశంసించారు.

ఇంతకీ విశాఖ యువకుడు రూపొందించిన ఏబీసీ ఛార్ట్ 2021లో ఏమున్నదన్నది చూస్తే..మొత్తం ఆరు కేటగిరిలలో వస్తువుల పేర్లను పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు.. సెల్ఫ్ కేర్.. బట్టలు.. ఆఫీస్ అండ్ వర్క్.. కిచెన్ తో సహా ఇతర వస్తువుల పేర్లను ప్రస్తావించారు. రోజువారీ అవసరాలకు.. ఏయే బ్రాండ్లను వాడుకోవచ్చన్న ఆప్షన్ ఇచ్చారు. ఇవన్నీ స్వదేశీ వస్తువుల బ్రాండ్లే కావటం గమనార్హం. ఏసీ మొదలుకొని.. టూత్ బ్రష్ వరకు అన్ని దేశంలో తయారైనవని.. స్వదేశీ బ్రాండ్లనే ప్రస్తావించారు. ఈ ఆలోచనే.. ప్రధాని నోటి వెంట వెంకట మురళీ ప్రసాద్ మాట పలికేలా చేసింది.