జగన్ సర్కారుకు కేంద్రం వార్నింగ్!


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవలే ‘జగనన్న తోడు’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టగా.. ఆ పథకం కింద ఏ ష్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడానికి నిరాకరించాయన్న కారణంతో కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ శాఖల ఎదుట చెత్త తీసుకొచ్చి పోయడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ పని మున్సిపల్ శాఖ సహకారంతో అధికార పార్టీ నాయకులు చేయడం చర్చనీయాంశమైంది.

మున్సిపల్ శాఖ అధికారుల భాగస్వామ్యం కూడా ఇందులో ఉందన్న ఆరోపణలు విస్మయం కలిగించేవే. వీధి వ్యాపారుల కోసం ‘జగనన్న తోడు’ పేరుతో ప్రభుత్వం ఇటీవలే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దాని కింద బ్యాంకులు రూ.10 వేల మొత్తానికి లోన్ ఇస్తాయని.. ఎలాంటి పూచీకత్తు అవసరం లేదని.. ఈ డబ్బులకు వడ్డీ ప్రభుత్వం కడుతుందని.. అసలు మాత్రం వాయిదాల రూపంలో రుణ గ్రహీతలు చెల్లించాలని పేర్కొంది. ఐతే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చేసింది కానీ.. ఏ పూచీకత్తూ లేకుండా ఈ లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఈ లోన్లకు ఎవరు బాధ్యత తీసుకుంటాయని ప్రశ్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కొవ్వూరులోని బ్యాంకుల తీరుకు నిరసనగా అధికార పార్టీ నాయకులు, మున్సిపల్ శాఖ అధికారుల సహకారంతో చెత్త లారీలు తీసుకొచ్చి ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ బ్రాంచుల ఎదుట డంప్ చేశారు. ‘జగనన్న తోడు’ పథకానికి సహకరించనందుకే ఇలా చేసినట్లు నోట్ కూడా పెట్టారు. బ్యాంకులతో వ్యవహారం అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి వెళ్లింది. ఆమె ఈ విషయంపై వెంటనే స్పందించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్‌తో మాట్లాడారు. బ్యాంకులతో ఇలా వ్యవహరించడం సరికాదని.. ఆమె ఆయనకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లోనే బ్యాంకుల ముందు చెత్త తొలగించినట్లు సమాచారం.