సినిమా షూటింగులపై ఆ రోజు తేలిపోతుంది

సినిమాల రిలీజ్ లేదు. షూటింగులు ఆగిపోయాయి. సినిమాను నమ్ముకున్న వారి కష్టాలు మామూలుగా లేవు. థియేటర్లయితే ఇప్పుడిప్పుడే తెరుచుకోవని అర్థమవుతోంది. ఇంకో ఐదారు నెలల దాకా ఎదురు చూడాల్సి రావచ్చు.

కనీసం షూటింగులకైనా అనుమతిస్తే పరిశ్రమను నమ్ముకున్న కార్మికుల కష్టాలు తీరుతాయి. అలాగే నిర్మాతల మీద భారం తగ్గుతుంది. లాక్ డౌన్ టైంలో అయితే అందుకు అవకాశం లేదు. కనీసం మూడో లాక్ డౌన్ ముగిసే సమయానికైనా చిత్రీకరణలకు అనుమతులిస్తే చాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఆల్రెడీ దిల్ రాజు నేతృత్వంలో నిర్మాతల బృందం తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీవీ నిర్మాతల సంఘం నేరుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిసి అనుమతుల కోసం విన్నవించి వచ్చింది. తక్కువ మంది సిబ్బందితో, భౌతిక దూరం పాటిస్తూ షూటింగులు చేస్తామని వాళ్లు విన్నవించారు.

షూటింగులకు అనుమతులు ఇచ్చే విషయంలో ఇంకో రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 5న మంత్రి మండలితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చే విషయమై ఇందులో చర్చ జరగనుంది. సినీ రంగానికి సంబంధించి కూడా అందులో చర్చ జరగనుంది.

ఐతే ఆ సమావేశం కంటే ముందు మంత్రి తలసాని సినీ ప్రముఖులు, మీడియా వాళ్లతో సమావేశం నిర్వహించనున్నారు. షూటింగులు, ఇతర విషయాలపై ఇందులో చర్చించి.. క్రోఢీకరించిన అభిప్రాయాల్నిమంత్రి మండలి ముందు పెట్టనున్నారు. ఈ నెల 17 తర్వాత కొన్ని షరతుల మధ్య షూటింగులు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వొచ్చని.. ఈ మేరకు సమావేశంలో నిర్ణయం వెలువడ వచ్చని సినిమా వాళ్లు ఆశిస్తున్నారు.