కేసీఆర్ టీం మొత్తం అబ‌ద్దాలే చెప్పింద‌ట‌

Bandi Sanjay

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇర‌కాట‌లో ప‌డే ప‌రిస్థితి. ఓ వైపు ఆయ‌న స‌ర్కారు ఆర్భాటంగా ప్ర‌చారం చేసుకుంటున్న విష‌యంలోనూ… మ‌రోవైపు విప‌క్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఏ విష‌యంలో అయితే గులాబీ స‌ర్కారు త‌మ ఘ‌న‌త అని పేర్కొంటుందో అదే విష‌యంలో విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

తెలంగాణ‌లో క‌రోనా కేసులు, అందుతున్న వైద్య సేవ‌లు ఇత‌ర‌త్రా ప‌రిశీలించేందుకు ఇటీవ‌ల రాష్ట్రానికి కేంద్రం ప్ర‌తినిధి బృందం వ‌చ్చింది. అనంత‌రం తెలంగాణ‌పై ప్ర‌శంస‌లు కురి‌పించింది. అయితే, దీనిపై విప‌క్షాలు టార్గెట్ చేశాయి.

ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ సైతం విమ‌ర్ళలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గించి చూపేందుకే తక్కువ టెస్టులు చేస్తున్నారని అనుమానం వ్య‌‌క్తం చేశారు. ప్రపంచం మొత్తం ఎక్కువ టెస్టులు చెయ్యాలని అంటుంటే సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణలో తక్కువ టెస్టులు చేయిస్తున్నారని ఆయ‌న అన్నారు.

క‌రోన కేసుల సంఖ్య తక్కువ చూపడానికి తాపత్రయ పడుతున్నారని, అందుకే ఎవరైనా చనిపోయినా కూడా వారికి కరోన టెస్టులు చెయ్యవద్దని ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.

ఇక బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా కేంద్ర హోం వాఖ‌కు ఫిర్యాదు చేశారు. క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరీక్షలు జ‌ర‌ప‌డం లేదని, తక్కువ సంఖ్యలో మరణాలు, కేసులు చూపిస్తూ.. ఇటీవ‌ల రాష్ట్రానికి వ‌చ్చిన కేంద్రం ప్ర‌తినిధి బృందాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణలో క‌రోనా ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ బృందాన్ని పంప‌గా.. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో, వ్యాధి చికిత్స విష‌యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు సంతృప్తికర ఉన్నాయని కేంద్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వార్త‌లు వ‌చ్చాయని వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు చెయ్య‌డం లేద‌ని, కోవిడ్ ఆసుపత్రిగా మార్చబడిన గాంధీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి సౌకర్యాలు లేవ‌ని త‌మ‌కు వివిధ వర్గాల నుండి చాలా ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు.