తేజు చేసింది చాలు.. సినిమాలు ఆపేయ‌మ‌న్నాడు

సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్లో పేరున్న స్టార్ల‌లో ఒక‌డు. అత‌డి పేరు మీద 25-30 కోట్ల మ‌ధ్య మార్కెట్ జ‌రుగుతుంది ఓ సినిమా మీద‌. ప్ర‌స్తుతం అత‌ను ప్ర‌తిరోజూ పండ‌గే లాంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత ఊపుమీదున్నాడు. త‌న కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెట‌ర్ మీద మంచి అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఇలాంటి హీరో కెరీర్ ఆరంభంలో ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొన్నాడు. పేరున్న కుటుంబం, పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ కెరీర్ ఆరంభంలో అత‌డికి క‌లిసి రాలేదు. తొలి సినిమా రేయ్ ఒక ప‌ట్టాన పూర్తి కాలేదు. విడుద‌ల కూడా బాగా అల‌స్య‌మైంది. రిలీజ‌య్యాక దాని ఫ‌లిత‌మూ తెలిసిన సంగ‌తే.

ఇక దాని కంటే ముందు విడుద‌లైన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రానికి కూడా క‌ష్టాలు త‌ప్ప‌లేదు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లో ఉండ‌గా అందులో కీల‌క పాత్ర చేస్తున్న శ్రీహ‌రి చ‌నిపోయాడు. త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబును ఆ పాత్ర‌కు తీసుకున్నారు. సినిమా పూర్తి చేసి ఎలాగోలా రిలీజ్ చేశారు. అది హిట్ట‌వ‌డంతో తేజు ద‌శ తిరిగింది.

కానీ శ్రీహ‌రి చ‌నిపోవ‌డం వ‌ల్ల సినిమా మ‌ధ్య‌లో ఆగిపోయే ప‌రిస్థితుల్లో తన ప‌రిస్థితి దారుణ‌మంటూ ఒక జాతీయ ఇంగ్లిష్ మీడియా సంస్థ‌కు ఇచ్చిన వీడియో ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు తేజు. ఆ స‌మ‌యంలో మెగాస్టార్ అభిమాని ఒక‌రు త‌న‌కు ఫోన్ చేసి సినిమాలు ఆపేయ‌మ‌న్నాడ‌న్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది చాలు.. నీకు సినిమాల్లో క‌లిసొచ్చేలా లేదు.. ఇక సినిమాలు ఆపేయి అని అత‌ను త‌న‌కు ఖ‌రాఖండిగా చెప్పేసిన‌ట్లు తేజు వెల్ల‌డించాడు.

ఐతే తాను చేస్తున్న రెండు సినిమాలూ పూర్తి చేసి.. అవి విడుద‌ల‌య్యాక తాను ప‌నికి రాన‌ని ఫీలైతే క‌చ్చితంగా సినిమాలు మానేస్తాన‌ని ఆ అభిమానికి ఓపిగ్గానే చెప్పిన‌ట్లు తేజు చెప్పాడు. ఐతే పిల్లా నువ్వు లేని జీవితం విడుద‌లై హిట్ట‌వ‌డం, త‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్క‌డంతో అదే అభిమాని మ‌ళ్లీ త‌న‌కు ఫోన్ చేసి సారీ చెప్పిన‌ట్లు తేజు వెల్ల‌డించాడు.