చిత్రం భళాలే విచిత్రం.. తెలంగాణలో యాపిల్ తోట

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడా యాపిల్ పండ్లు పెద్దగా కనిపించడం లేదు. అవి పండేది కశ్మీర్ లాంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే. లాక్ డౌన్ కారణంగా అక్కడి నుంచి రవాణా ఆగిపోవడంతో మార్కెట్లో ఈ పండ్లు కనిపించడం లేదు.

ఉత్తరాదిన కశ్మీర్‌తో పాటు కొన్ని శీతల ప్రాంతాల్లో.. దక్షిణాదిన ఊటీ లాంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే యాపిల్ పండుతుంది. తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి ప్రాంతాల నుంచే యాపిల్ వస్తుంది. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా తెలంగాణలోనే యాపిల్ పండిస్తుండటం విశేషం. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రైతు ప్రయోగాత్మకంగా చేపట్టిన యాపిల్ పెంపకం మంచి ఫలితాలే అందిస్తోంది. ముందు కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించిన బాలాజీ అనే రైతు విజయవంతంగా యాపిల్స్ పండించాడు.

ఇప్పుడు 100కు పైగా యాపిల్ చెట్లు ఏపుగా పెరిగాయి. వాటిలో 20 నుంచి 40 దాకా కాయలున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఒక్కో కాయ 250 గ్రాముల పరిమాణానికి చేరుతుందని భావిస్తున్నాడా రైతు. వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మకాలు మొదలుపెట్టనున్నాడు. కెరమెరి మండలం ధనోరా ప్రాంతంలో ఈ యాపిల్ తోట పెరుగుతోంది. అక్కడ రాత్రి పూట 4-7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటోంది. మిగతా సమయాల్లో కూడా వాతావరణం చల్లగా ఉండేలా ఏర్పాట్లు చేశాడు రైతు. నిరంతరం తేమ ఉండేలా కూడా చూసుకున్నాడు.

ముందు రాజమండ్రి నుంచి కొన్ని యాపిల్ మొక్కలు తెచ్చి పెంచే ప్రయత్నం చేశాడు బాలాజీ. దీని గురించి తెలిసిన స్థానిక వ్యవసాయాధికారులు 150 యాపిల్ మొక్కలు అందజేశారు. అందులో 50 దాకా చనిపోగా 100 మొక్కలు నిలబడ్డాయి. జాగ్రత్తగా కాపాడుకుంటూ రాగా.. ఇప్పుడు పండ్లు సమృద్ధిగా కాశాయి. తొలి కాపు తీశాక 20 ఏళ్ల దాకా యాపిల్ చెట్లు కాపు ఇస్తాయి. త్వరలో యాపిల్ తోటను మరింతగా విస్తరించడానికి ఆ రైతు సన్నాహాలు చేసుకుంటున్నాడు. వ్యవసాయాధికారులు కూడా మరిందరు రైతులను ఈ దిశగా ప్రోత్సహించాలని చూస్తున్నారు.