హైకోర్టును జగన్ సర్కారు లైట్ తీసుకుంటోందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… హైకోర్టు జారీ చేస్తున్న ఉత్తర్వులను చాలా లైట్ తీసుకుంటోందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. జగన్ సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఇప్పటికే హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

పీపీఏల పున:సమీక్ష, సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తదితర అంశాల్లో జగన్ సర్కారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. అయినా కూడా ఈ నిర్ణయాల విషయంలో జగన్ సర్కారు వెనక్కు తగ్గిన దాఖలా కనిపించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాజాగా అక్రమ మైనింగ్ అంటూ పలు గ్రానైట్ కంపెనీల మీద వేసిన జరిమానా విషయంలోనూ జగన్ సర్కారు హైకోర్టు ఉత్తర్వులను చాలా లైట్ తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది.

ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారులకు దాదాపు రూ. 2,500 కోట్ల అపరాధ రుసుము విధిస్తూ గనులు, భూగర్భశాఖ గతంలో ఇచ్చిన నోటీసులను హైకోర్టు ఇంతకు ముందే కొట్టేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం మరోమారు సదరు వ్యాపారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో, ఓ క్వారీ యజమాని హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం విచారించిన హైకోర్టు… ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గతంలోనే తాము ఒక తీర్పును వెలువరించామని… ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా గ్రానైట్ పరిశ్రమ మూతపడిన తరుణంలో జరిమానాలు విధించడం ఏమిటని ప్రశ్నించింది.

అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను వ్యాపారులు ఇప్పటికిప్పుడు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ వైపు జరిమానా వసూలు, వ్యాపారులకు నోటీసులను ఇదివరకే తాము కొట్టివేస్తే… ఆ ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకున్నట్లుగా లేదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూనే… తాము జారీ చేసిన ఆదేశాలను కూడా పట్టించుకోరా? అన్న రీతిలో వ్యవహరించిన హైరోర్టు.. జగన్ సర్కారు ఇచ్చిన నోటీసులను క్వారీల నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత, గ్రానైట్ పరిశ్రమ గాడిలో పడిన తర్వాత ఆలోచిద్దామని హైకోర్టు తేల్చిచెప్పింది.