అస్త్రాలన్నింటినీ మోహరిస్తున్న బీజేపీ

ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో గెలవాలన్న ఏకైక లక్ష్యంగా బీజేపీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. మామూలుగా అయితే మేయర్ పీఠం కోసం ఇంతగా కష్టపడేది కాదేమో. ఈ మధ్యనే జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలవటంతో పార్టీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దుబ్బాకలో గెలుపుతో కమలనాథులు రచ్చ రచ్చ చేస్తన్నారు. ఎప్పుడు లేని గోల మొదలపెట్టేశారు. దుబ్బాక విజయం తాలూకు హ్యాంగోవర్ తగ్గక ముందే గ్రేటర్ ఎన్నికలు కూడా వచ్చేయటంతో ఆకాశమే హద్దుగా బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు.

ఇందులో భాగంగానే ఇటు కేసీయార్ అటు అసదుద్దీన్ ఓవైసిని చాలెంజ్ చేస్తు ఒకేసారి తొడ కొడుతున్నారు కమలనాథులు. 150 డివిజన్లలో బీజేపీ 149 డివిజన్లలో పోటీ చేస్తోంది. తమ అభ్యర్ధుల విజయానికి రాష్ట్రంలోని నేతలందరినీ మోహరించింది. వీళ్ళనే కాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాద్, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారానికి వస్తున్నారు. సీనియర్ నేతలను, కేంద్రమంత్రి, ఉత్తర ప్రదేశ్ సిఎం ఆదిత్యనాథ్, తదితరులను కేంద్రం హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు.

సీనియర్ నేతల్లో ఎవరిని ఏ డివిజన్లో పనిచేయించాలి, ఎవరితో ప్రచారం చేయించాలనే విషయాలను కిషన్ రెడ్డి దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ పరిధిలో రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన జనాలు కూడా స్ధిరపడిపోయారు. వీరందరు సుమారు 15 లక్షలకు పైగా ఉంటారని అంచనా. అందుకనే బయట రాష్ట్రాల జనాలను సమన్వయం చేసే బాధ్యతలను భూపేందర్ యాదవ్ కు అప్పగించారు. యాదవ్ ఇటీవలే జరిగిన బీహార్ ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేసి ఫలితం చూపించారు. అందుకనే యాదవ్ కు గ్రేటర్ బాధ్యతలు కూడా అప్పగించారు.

ఏదేమైనా ఈసారి గ్రేటర్ పీఠాన్ని గెలుచుకోవటమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతున్నప్పటికీ అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒకవైపు అధికార టీఆర్ఎస్ మరోవైపు బలమైన ఎంఐఎంలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఓల్డ్ సిటిలో ఎంఐఎం ఎంత బలమైన పార్టీయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎంఐఎం 52 డివిజన్లలో పోటీ చేస్తోంది. ఇక టీఆర్ఎస్ 150 డివిజన్లలోను పోటీ చేస్తోంది. మొన్ననే రద్దయిన జీహెచ్ఎంసి పాలకమండలిలో టీఆర్ఎస్ బలం 99 స్ధానాలు. ఈసారి సెంచెరీ దాటిపోవావలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

అవసరమైతే టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి తమ పార్టీల మధ్య పొత్తు లేదని రెండు పార్టీల అధినేతలు చెబుతున్నా జనాలెవరు నమ్మటం లేదు. అయితే ఎన్నికల తర్వాత కలిసిపోతాయని అందరికీ అర్ధమైపోయింది. ఈ పరిస్ధితుల్లో గ్రేటర్ పీఠాన్ని బీజేపీ గెలుచుకోవటం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే రద్దయిన జీహెచ్ఎంసిలో బీజేపీకి 4 డివిజన్లు మాత్రమే ఉండేవి. సరే గెలిచినా గెలవకపోయినా బీజేపీ ఊపు చూస్తుంటే మాత్రం గ్రేటర్ లో కమలం పార్టీయే జెండా పాతేస్తుందా ? అన్నంత షో జరిగిపోతోంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.