మంత్రి అయిన గంట లోనే రాజీనామా

మంత్రిగా బాద్యతలు తీసుకున్న గంటల్లోనే నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు మేవాలాల్ చౌదరి రాజీనామా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ మంత్రివర్గంలో జేడీయు ఎంఎల్ఏ, విద్యాశాఖ మేవాలాల్ చౌదరి కూడా ఒకరు. ఈయన గురువారం బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే తన పదవికి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. మంత్రిగా బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు ? తీసుకున్న గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా చేశారు అన్నది ఆసక్తిగా మారింది.

ఇంతకీ విషయం ఏమంటే మేవాలాల్ పై 2017లో క్రిమినల్ కేసు నమోదైంది. భాగల్ పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఉన్న కాలంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరిగాయి. అయితే నియామకాల తర్వాత మేవాలాల్ భారీ ఎత్తున అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారంటు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల కారణంగా జేడీయూ నుండి నితీష్ అప్పట్లో మేవాలాల్ ను సస్పెండ్ కూడా చేశారు.

ఇదే సమయంలో అప్పటి గవర్నర్ రామ్ నాధ్ కోవిండ్ ఈయనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారుల విచారణలో మేవాలాల్ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. మేవాలాల్ అవినీతికి, అక్రమాలకు ఎన్ని ఆధారాలున్నా ఆయనపై ఇప్పటి వరకు ఛార్జిషీటు నమోదుకాలేదు. ఇదే విషయమై అప్పట్లోనే మేవాలాల్ మాట్లాడుతూ తనపై కేసు నమోదైనందుకు తానేమీ సిగ్గు పడటం లేదని వ్యాఖ్యానించటం సంచలనమైంది. ఎందుకంటే తనతో పాటు చాలా మంది ఎంఎల్ఏలపైన అనేక కేసులున్నాయి కాబట్టి తానేమీ సిగ్గుపడటం లేదని చెప్పటం గమనార్హం.

సరే ఈ కేసు ఇలాగుంటే 2019లో తనింట్లోనే తన భార్య అనుమాస్పదంగా మరణించారు. కాలిన గాయాలతో ఆయన భార్య మరణించటంతో మేవాలాల్ పై మరో కేసు నమోదైంది. ఆమె అనుమానాస్పద మరణంలో మేవాలాల్ హస్తం ఉందంటు అప్పటి నుండి ఆర్జేడీ ఆరోపణలు గుప్పిస్తునే ఉంది. ఇవన్నీ గమనించిన తర్వాత అర్ధమవుతున్నదేమంటే మేవాలాల్ ను తాజాగా విద్యాశాఖ మంత్రిగా తీసుకునేటప్పటికే ఆయనపైన కేసులున్నాయని. అయినా దేన్నీ పట్టించుకోకుండా నితీష్ మాత్రం చక్కగా ఆయన్ను మంత్రిగా తీసేసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ మరి మంత్రిగా బాద్యతలు తీసుకున్న గంటల వ్యవధిలోనే మేవాలాల్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ అర్ధం కావటం లేదు.