ఆ ఎంఎల్ఏ కు క్యాడర్ తో గొడవలే గొడవలు

అవును మీరు చదివింది కరెక్టే. ఎవరైనా పార్టీలో ఇమడలేకపోవచ్చు కానీ ఏకంగా రాజకీయాల్లోనే ఇమడలేక పోవటం ఏమిటనే సందేహం రావచ్చు. ఈ కథనం మొత్తం చదవితే విషయం అర్ధమైపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడురు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటిచేసి గెలిచిన వరప్రసాద్ వ్యవహారమే పార్టీలో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గడచిన ఆరున్నరేళ్ళుగా ఎంఎల్ఏకి ప్రతిరోజు నేతలతోను, క్యాడర్ తోను గొడవలు జరుగుతునే ఉన్నాయి.

2014లో మొదటిసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన వరప్రసాద్ ఓ ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ప్రసాద్ అక్కడ చాలా జిల్లాల్లో పని చేశారు. అలాంటిది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తిరుపతి లోక్ సభకు పోటి చేసి గెలిచారు. పోటి చేసిన మొదటిసారే గెలవటంతో నియోజకవర్గంలో బాగా దూకుడుగా వ్యవహరించటం మొదలుపెట్టారు. ప్రసాద్ చాలా తొందరగా అసహనానికి గురవుతారనే ఆరోపణలు బాగా ఉన్నాయి. ఈ కారణంగానే ఇటు నేతలతోను అటు క్యాడర్ తోను సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఈ నేపధ్యంలోనే ప్రసాద్ ను తిరిగి ఎంపిగా కాకుండా గూడురు ఎంఎల్ఏగా పోటీ చేయిస్తే ఇక్కడ కూడా గెలిచారు. అప్పటి నుండి పార్టీలో గొడవలు ఎక్కువయిపోయాయి. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలను పట్టిచుకోకపోవటంతో ఎంఎల్ఏ ఎక్కడ సభలు పెట్టినా క్యాడర్ అక్కడ చేరి గొడవలు చేయటం మామూలైపోయింది. ఇదే సందర్భంలో గ్రామ సచివాలయానికి జరిగిన వాలంటీర్ల నియామకాలు, నియోజకవర్గంలో భర్తీ చేసిన లోకల్ టెంపుల్ కమిటిల్లాంటి వాటిల్లో ఎందులో కూడా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంఎల్ఏ సిఫారసు చేయలేదట.

తన సిఫారసుల ద్వారా భర్తీ అయ్యే అన్నీ పోస్టుల్లోను కేవలం తన సొంత వర్గం వారిని మాత్రమే భర్తీ చేసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోవటంతో గొడవలు ఎక్కువైపోయాయి. ఈ విషయం పార్టీ దృష్టికి రావటంతో ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని పంచాయితీ సెటిల్ చేయమని జగన్మోహన్ రెడ్డి పురామాయించారు. అయితే బాలినేని సమక్షంలో జరిగిన పంచాయితి సెటిల్ కాలేదు. ఎందుకంటే ఇటు ఎంఎల్ఏ అటు ద్వితీయ స్ధాయి నేతలు ఎవరు తమ పట్టు వీడలేదట. దాంతో ఏమి చేయాలో అర్ధంకాని బాలినేని విషయాన్ని జగన్ కే విడిచిపెట్టేశారు.

ఈ సమస్య ఇలాగుండగానే ఈమధ్యనే జరిగిన ఓ సమావేశంలో ఎంఎల్ఏ మాట్లాడుతు తాను జగన్ వల్ల గెలవలేదని కేవలం తన సొంత ఇమేజితోనే గెలిచినట్లు చేసిన ప్రకటన పార్టీలో మంటలు మండిస్తోంది. నిజానికి ఎవరు ఎవరి వల్ల గెలిచారన్నది ఇపుడు పెద్ద విషయమే కాదు. పార్టీతో పాటు ప్రభుత్వ ఇమేజిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఎంఎల్ఏనే నోటికొచ్చినట్లు బహిరంగ సభలో మాట్లాడటంతో గొడవ పెద్దదయిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపిగా ఉన్నపుడు, ఎంఎల్ఏగా ఉన్నపుడు కూడా నేతలు, క్యాడర్ తో ప్రసాద్ కు గొడవలవుతునే ఉన్నాయి. కాబట్టి ప్రసాద్ అసలు రాజకీయాల్లోనే పనికిరాడంటూ నేతలు మండిపోతున్నారు. ఇంకా తానొక ఐఏఎస్ అధికారిగానే వ్యవహరిస్తున్నారంటూ జగన్ కు ఫిర్యాదులు కూడా చేశారు. మరి జగన్ సమక్షంలో ఏమి తేలుతుందో చూడాల్సిందే.