వైసీపీ ఎంఎల్ఏకు ప్రాణహాని ఉందట

అధికారపార్టీ ఎంఎలఏకే ప్రాణహాని ఉందట. గుంటూరు జిల్లాలోని రాజధాని నియోజకవర్గం తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి స్వయంగా ఈ మేరకు తానే ఫిర్యాదు చేశారు కాబట్టి నిజమే అనుకోవాల్సుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎంఎల్ఏపై నియోజకవర్గంలోని ఇద్దరు కార్యకర్తలు శృంగారపాటి సందీప్, చలివేంద్రపు సురేష్ కు ఎంఎల్ఏకు పూర్తిస్ధాయిలో గొడవలు నడుస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం బాపట్ల ఎంపి నందిగం సురేష్, తాడికొండ ఎంఎల్ఏ శ్రీదేవి నుండి తమకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందు ఆరోపణలు చేయటం సంచలనమైంది.

దానికి బదులుగా తాజాగా ఎంఎల్ఏ ఎదురు ఆరోపణలు మొదలుపెట్టారు. ఆరోపణలే కాకుండా ఏకంగా గుంటూరులోని నగరపాలెం పోలీసు స్టేషన్లో పై ఇద్దరిపైన ఫిర్యాదు చేసింది. వీళ్ళిద్దరు తనపై కక్షగట్టి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నారని కాబట్టి వాళ్ళ నుండి తనకు ప్రాణహాని ఉందని తన ఫిర్యాదులో చెప్పారు.

వైసీపీ కార్యకర్తలుగా ఉన్న సందీప్, సురేష్ ఇద్దరు చట్ట విరుద్ధంగా మద్యం వ్యాపారం చేస్తున్నారని, పేకాట ఆడిస్తున్న కారణంగానే ఈ ఇద్దరినీ పార్టీ నుండి బహిష్కరించినట్లు శ్రీదేవి చెప్పారు. వాళ్ళపై పార్టీ తీసుకున్న బహిష్కరణ వేటుకు తనకు ఏమీ సంబంధం లేదన్నారు. తనకు సంబంధం లేకపోయినా తానే వాళ్ళిద్దరిపైన బహిష్కరణ వేటు వేయించారన్న అభిప్రాయంతో తనపై కక్షకట్టినట్లు ఎంఎల్ఏ అభిప్రాయపడ్డారు.

తన గొంతును మార్ఫింగ్ చేస్తు ఫోన్లో నియోజకవర్గంలోని చాలామందితో వీళ్ళద్దరు అసభ్యంగా మాట్లాడుతున్నట్లు కూడా ఎంఎల్ఏ తన ఫిర్యాదులో చెప్పారు. తన విషయంలో వీళ్ళద్దరు వ్యవహరిస్తున్న విషయాలను దృష్టిలో పెట్టుకునే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మొత్తానికి గెలిచిన దగ్గర నుండి ఎంఎల్ఏ ఏదో కారణంతో వివాదాల్లోనే ఉంటున్నారు. కొద్ది రోజులు ఎంపి నందిగం సురేష్ తో వివాదాలతో తీవ్ర వివాదాస్పదమయ్యారు. తర్వాత పార్టీ కార్యకర్తలతో గొడవల కారణంగా వివాదాస్పదమవుతున్నారు. ఏమైనా అధికారపార్టీ ఎంఎల్ఏ ఇన్ని గొడవల్లో ఇరుక్కోవటమంటే అది ప్రభుత్వానికే చెడ్డపేరొస్తుంది.