కొత్త సినిమా రిలీజ్.. మినిమం బజ్ లేదే


ఎంత ఓటీటీ కాలమైనా సరే.. కొత్త సినిమా రిలీజవుతుంటే సోషల్ మీడియాలో ఎంతో కొంత డిస్కషన్ ఉంటుంది. ప్రమోషన్ హడావుడి ఉంటుంది. కానీ ‘మిస్ ఇండియా’ సినిమా విషయంలో అలాంటిదేమీ కనిపించడం లేదు. ఈ సినిమా ఇంకొక్క రోజులో విడుదలవుతున్న సంగతే జనాలకు తెలియడం లేదు. అసలు ముందు ఈ సినిమా పబ్లిసిటీకి దూరంగానే ఉంది. దీనికి ముందు కీర్తి నటించిన ‘పెంగ్విన్’ అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

లాక్ డౌన్ టైంలో ముందుగా ఓటీటీల్లో రిలీజైన సినిమాల్లో ఒకటి కావడంతో దీనికి హైప్ బాగానే వచ్చింది. కీర్తి నటించిన మరో సినిమా ‘గుడ్ లక్ సఖి’ కూడా అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. కానీ ‘మిస్ ఇండియా’ గురించి చప్పుడే లేదు. ఐతే వారం కిందట ఉన్నట్లుండి ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో నవంబరు 4న సినిమా రిలీజ్.

అంటే మంగళవారం అర్ధరాత్రి నుంచే ‘మిస్ ఇండియా’ స్ట్రీమ్ కాబోతోంది. కానీ ఈ సంగతే జనాలకు తెలియనట్లుగా ఉంది సోషల్ మీడియా వ్యవహారం చూస్తే. బయట చిన్న స్థాయిలో అయినా సరే ప్రి రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్లు లాంటివి లేవు. సోషల్ మీడియాలోనూ ప్రచారం లేదు. కొత్త సినిమాలు మామూలుగా శుక్రవారం రిలీజవుతాయి కానీ.. ఈ చిత్రాన్ని బుధవారమే విడుదల చేస్తుండటం కూడా జనాలకు విషయం తెలియకపోవడానికి ఒక కారణం కావచ్చు.

అసలు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన సినిమాలన్నింటి పరిస్థితి ఇలాగే ఉంటోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ను ఉన్నట్లుండి చడీచప్పుడు లేకుండా దించేశారు. అసలు ప్రకటన కూడా లేదు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఐతే రిలీజ్ ముంగిట పబ్లిసిటీ లేకపోయినా ఆ సినిమాలకు మంచి స్పందనే వచ్చిన నేపథ్యంలో దాన్ని సెంటిమెంటుగా భావిస్తున్నారో లేక కంటెంట్ మీద నమ్మకమో కానీ.. ‘మిస్ ఇండియా’ అయితే మినిమం బజ్ లేకుండా రిలీజవుతోంది.