ఇర్ఫాన్ స‌న్నిహితుల బాధ వ‌ర్ణ‌నాతీతం

క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోవ‌డం అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన మ‌ర‌ణంగా భావిస్తున్నారు అంద‌రూ. ఎందుకంటే కుటుంబ స‌భ్యులు కూడా పార్థివ దేహాన్ని తాక‌లేని, అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌లేని దౌర్భాగ్య ప‌రిస్థితులు క‌రోనా మృతుల విష‌యంలో చూస్తున్నాం. ఐతే ప్రస్తుత క‌రోనా కాలంలో మామూలుగా చ‌నిపోవ‌డం కూడా దుర‌దృష్ట‌మే అని చెప్పాలి. ఎందుకంటే.. లాక్ డౌన్ కార‌ణంగా ఎక్క‌డి వాళ్లు అక్క‌డ ఆగిపోవ‌డంతో స‌న్నిహితులు ఎవ‌రైనా చ‌నిపోయినా వెళ్లి క‌డ‌సారి చూడ‌లేని ప‌రిస్థితి.

గ‌త నెల రోజుల్లో చ‌నిపోయిన అనేక‌మందిని వారి సంతానం కూడా క‌డ‌సారి చూడ‌లేని ప‌రిస్థితి త‌లెత్తింది. స్వ‌యంగా యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ త‌న తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కాలేక‌పోయారు. క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఇంటి ప‌ని మ‌నిషి చ‌నిపోతే.. ఆమె కుటుంబ స‌భ్యుల ద‌గ్గ‌రికి పార్థివ దేహాన్ని చేర్చ‌లేక అత‌నే స్వ‌యంగా అంత్యక్రియ‌లు నిర్వ‌హించాడు.

మృతులు ఎంత‌టి వాళ్ల‌యినా స‌రే.. వారికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికే అవ‌కాశం లేక‌పోయింది. లెజెండ‌రీ బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. బుధ‌వారం ఆయ‌న అంత్య క్రియ‌లు చాలా సాధార‌ణంగా జ‌రిగాయి. కుటుంబ స‌భ్యులు, కొంద‌రు స‌న్నిహితుల మ‌ధ్య అంత్య‌క్రియ‌లు ముగించారు. ఇర్ఫాన్‌కు బాలీవుడ్లో ఎంతోమంది స‌న్నిహితులున్నారు. ఆయ‌న‌పై ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికి అపార‌మైన గౌర‌వ‌భావం ఉంది.

మామూలు రోజుల్లో అయితే ఇర్ఫాన్ అంత్య‌క్రియ‌ల‌కు వేల‌ల్లో జ‌నం హాజ‌ర‌య్యేవాళ్లు. బాలీవుడ్ అంతా ఆయ‌న ఇంటికి వెళ్లేది. కానీ క‌రోనా కార‌ణంగా ఎవ్వ‌రూ వెళ్లి చూడ‌లేని ప‌రిస్థితి. త‌మ మిత్రుడిని క‌డ‌సారి చూసుకుని క‌న్నీళ్లు పెట్టుకునే అవ‌కాశం కూడా లేక‌పోవ‌డంతో ఆయ‌న ఆప్తుల్ని తీవ్ర వేద‌న‌కు గురి చేసేదే.