న్యాయవ్యవస్ధపై జగన్ యుద్ధం ప్రకటించినట్లేనా ?

ఇన్నిరోజులుగా హైకోర్టు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా నిజంగానే రాష్టప్రభుత్వం హైకోర్టుపై యుద్ధం ప్రకటించినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపిస్తు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు దేశ వ్యాప్తంగా సంచలనమైంది. గతంలో దేశంలోని ఏ రాష్ట్రప్రభుత్వం కూడా ఏ హైకోర్టు మీద చేయని విధంగా ఫిర్యాదులు చేయటం కలకలం రేపుతోంది. అనేక అంశాలపై హైకోర్టులోని కొందరు జడ్జీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే విషయాలను ఉదాహరణలతో సహా వివరించారు.

తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైకోర్టు వ్యవహరిస్తున్న తీరును జగన్ ప్రస్తావించారు. చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ద్వారా హైకోర్టులోని జడ్జీలను ఏ విధంగా మ్యానేజ్ చేస్తున్నారనే విషయాలను జగన్ తన ఫిర్యాదులో స్పష్టంగా చెప్పటమంటే మాములు విషయం కాదు.

మామూలుగా హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ స్ధాయిలో వ్యాఖ్యలు చేయటం గతంలో ఎప్పుడూ జరగలేదు. పైగా ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, విచారణల విషయంలో అసలు జోక్యం చేసుకునేవి కావు. కానీ జగన్ ముఖ్యమంత్రయిన తర్వాతే హైకోర్టు చాలా యాక్టివ్ గా మారిందని ఎప్పటి నుండో వైసీపీ ఎంఎల్ఏలు, నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే హైకోర్టు అడ్మిట్ చేసుకుని విచారణకు ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం, స్టేలు ఇచ్చేయటాన్ని జగన్ ఉదాహరణలతో సహా ప్రస్తావించారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ని ఎన్వీ రమణ మ్యానేజ్ చేస్తున్నట్లు జగన్ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలవుతున్న కేసులను హైకోర్టులోని కొందరు జడ్జీల బెంచిల్లో మాత్రమే విచారణ జరిగేలాగ ఎన్వీ రమణ ఏ విధంగా మ్యానేజ్ చేస్తున్నారంటూ జగన్ ఆరోపించటం మామూలు విషయం కాదు. నేరుగా న్యాయవ్యవస్ధతో తలపడితే జరిగబోయే పరిణామాలు ఎలాగుంటాయి అన్న విషయాన్ని కూడా పక్కనపెట్టేసి ఆరోపణలు చేస్తు లేఖ రాయటమంటే జగన్ చాలా పెద్ద సాహసం చేసినట్లే అనుకోవాలి.

చంద్రబాబు హయాంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ +12 మందిపై ఏసీబీ విచారణ మొదలుపెట్టగానే హైకోర్టు స్టే ఇఛ్చిన విధానాన్ని జగన్ తన లేఖలో ప్రస్తావించారు. అలాగే ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఎన్వీ రమణ ఇద్దరు కూతుర్ల పాత్రను కూడా జగన్ ప్రస్తావించారు. తన లేఖ మొత్తంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా ఏ ఏ జడ్జీలు వ్యవహరిస్తున్నారనే విషయాన్ని కూడా జగన్ తన లేఖలో ఫిర్యాదు మూలకంగా వివరించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, కొందరు జడ్జీలపై స్వయంగా ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదులను తేలిగ్గా కొట్టిపారేసేందుకు లేదు.

ముఖ్యమంత్రి రాసిన లేఖలోని అంశాలను, ఫిర్యాదులను సుప్రింకోర్టు కచ్చితంగా విచారణ జరపాల్సిన అవసరం ఇపుడొచ్చింది. సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలా? లేకపోతే విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలా ? అనే విషయం సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేపైనే ఆధారపడుంటుంది. ఎవరితో విచారణ చేయించినా విచారణ అయితే తప్పదనే అర్ధమవుతోంది. తన విచారణలో జగన్ చేసిన ఫిర్యాదులు తప్పనో లేకపోతే నిజమే అనో ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్ధితి వచ్చింది.

జగన్ చేసిన ఫిర్యాదులు తప్పయితే జగన్ మీదే చర్యలు తీసుకోవాలి. ఇదే సందర్భంగా జగన్ ఫిర్యాదుల్లో నిజముందని తేలితే ఎవరి పైన సుప్రింకోర్టు యాక్షన్ తీసుకుంటుందో చూడాల్సిందే. మొత్తం మీద జగన్ చేసిన ఫిర్యాదు కారణంగా మొత్తం న్యాయవ్యవస్ధపైనే విపరీతంగా చర్చయితే మొదలైంది.