టార్గెట్ చేసి ఎంపిపై దాడులు చేయించారా ?

వైసీపీలో తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఇళ్ళు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసి చీటింగ్ కేసులు పెట్టటంతో జగన్మోహన్ రెడ్డి పాత్రుందా ? అంటే… అవుననే మండిపడితున్నారు ఎంపి రాజు గారు. తనను టార్గెట్ చేసి సీబీఐతో దాడులు చేయించి కేసులు పెట్టించారంటూ ఎంపి ఆరోపించారు. మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి కోసం జగన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ ను అనేకమంది కలిశారు. ఇందులో భాగంగానే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎండి అండ్ కో కూడా కలిశారట. ఆ తర్వాతే తనపై సీబీఐ దాడులు చేయాలని, కేసులు పెట్టాలని డిసైడ్ అయ్యిందనేది ఎంపి ఆరోపణ.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రోజూ సిఎంను అనేకమంది కలుస్తారు. ఇదే పద్దతిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్బీ) ఎండి కూడా కలుసుంటారు. ఈ భేటిలోనే తనపై దాడులు చేయాలని, కేసులు పెట్టాలని డిసైడ్ అయ్యిందనటానికి ఎంపికి ఉన్న ఆధారమేంటో తెలియటం లేదు. ఈ విషయం ఇలాఉంటే ఎంపి బ్యాంకులో తీసుకున్న అప్పు, ఎగ్గొట్టడం అనే అంశం కొత్తదేమీ కాదు. చాలా కాలంగానే ఎంపిపై ఆరోపణలున్నాయి. అలాంటి కేసులు తనపై ఉన్నట్లు రెండు సందర్భాల్లో రాజుగారు ఒప్పుకున్నారు కూడా. రూ. 2226 కోట్లు అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరపున పిఎన్బీ ఉన్నతాధికారులు కేంద్రానికి చాలా కాలం క్రితమే ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఫిర్యాదు, కేంద్రం ఆదేశాలతో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది.

బ్యాంకు ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన ఈడి అధికారులు జరిగిన మోసాన్ని గుర్తించినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తీసుకున్న అప్పులో సుమారు 900 కోట్ల రూపాయలు దారిమళ్ళినట్లు ఈడి గుర్తించినట్లు సమాచారం. దానిపై ఎంపిపై అప్పట్లోనే కేసు నమోదైంది. కాకపోతే బ్యాంకు ఫిర్యాదు, ఈడి విచారణ మొదలైన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కృష్ణంరాజు వైసీపీ తరపున పోటి చేసి నరసాపురం ఎంపిగా గెలిచారు. ఆ తర్వాతే విచారణలో స్పీడు తగ్గిపోయిందట.

మళ్ళీ విచారణలో జోరును పెంచిన ఈడి తన నివేదికను కేంద్రానికి అందించింది. దానిపై కేంద్రం మళ్ళీ సీబీఐ విచారణకు ఆదేశించింది. దాని ఫలితమే గురువారం ఎంపి ఇళ్ళు, కార్యాలయాలతో పాటు, డైరెక్టర్ల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు అని మరొక సమాచారం. దాడుల తర్వాత ఎంపి, ఆయన భార్య రమాదేవి, కూతురు ఇందిరా ప్రియదర్శినితో పాటు మరికొందరు డైరెక్టర్ల పైన కూడా చీటింగ్ కేసులు పెట్టింది. దీంతో రఘురామరాజు ఎంపి జగన్ పై మండిపోతున్నారు. పిఎన్బీ ఎండిని జగన్ ప్రభావితం చేసి సిబీఐతో ఫిర్యాదు చేయించి దాడులు చేయించారంటూ మండిపోతున్నారు. విచారణ పూర్తిగా జరిగితేనే కదా ఎవరి హస్తముందో ? తేలేది.