బిహార్ సీఎం అభ్యర్థి ఖరారు చేసిన జేడీయూ-బీజేపీ కూటమి

బిహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభ సమయంలో దేశంలో నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగునుండగా…నవంబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపు, టికెట్ల పంపకాలలో బిజీగా ఉన్నాయి. సమయం తక్కువగా ఉండడంతో ఆఘమేఘాల మీద అభ్యర్థులను ఖరారు చేసి ముమ్మర ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే జేడీ-యూ-బీజేపీ కూటమి ల సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ కు ఆ కూటమి తెర తీసింది. ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా కూటమి ప్రకటించింది. దీంతోపాటు ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై విభేదాలు వచ్చాయన్న వదంతులపై నితీష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కలిసికట్టుగా పోటీ చేస్తామని, రాష్ట్రాభివృధ్ది కోసం తాము బీజేపీతో కలిసి పనిచేస్తామని నితీష్ అన్నారు. సీట్ల సర్దుబాటులో ఎలాంటి విభేదాలు, అపోహలు లేవని చెప్పారు.

తమకు మొత్తం 122 సీట్లు ఇచ్చారని, వాటిలో ఏడింటిని జితన్ రామ్ మంజి నేతృత్వంలోని హిందుస్తానీ అవామీ మోర్ఛాకు కేటాయించామని నితీష్ తెలిపారు. బీజేపీ 121 సీట్లకు పోటీ చేస్తుందని, వికాస్ సీల్ ఇన్సాఫ్ పార్టీకి వాటిలో కొన్ని సీట్లు కేటాయిస్తుందని నితీష్ తెలిపారు. కాగా, రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుని సొంతంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, జనతాదళ్(యు)పై మాత్రమే తాము పోటీ చేస్తామని, బీజేపీకి వ్యతిరేకం కాదని లోక్ జనశక్తి(ఎల్జేపీ) అధినేత రాం విలాస్‌ పాశ్వాన్‌ అన్నారు. అయితే, ఎల్జేపీ 42 సీట్లు కోరితే కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తానని బీజేపీ చెప్పడంతో ఎన్డీఏ నుంచి వైదొలిగామని పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు.