అందరికీ క్లీన్ చిట్లు భలేగ వచ్చేస్తున్నాయే

మొన్నటికి మొన్న బాబ్రీ మసీదు కూల్చివేతలో అందరికీ క్లీన్ చిట్. తాజాగా నయీం కేసులో కళంకిత పోలీసు అధికారులందరికీ క్లీన్ చిట్. అంటే పై రెండు ఘటనల్లో కూడా సంవత్సరాల తరబడి దర్యాప్తులు, విచారణలు చేసిన తర్వాత అనుమానితులందరికీ క్లీన్ చిట్ వచ్చేసింది. మరి ఇదే నిజమైతే సంవత్సరాల పాటు దర్యాప్తులు ఎందుకు ? విచారణలు ఎందుకు చేసినట్లు ? ఏ కేసులో అయినా సుదీర్ఘ విచారణ జరిగిందంటే, వేలాదిమంది సాక్ష్యులను విచారించారంటే కచ్చితంగా తప్పుచేసిన వారికి శిక్ష పడుతుందనే అనుకుంటారు ఎవరైనా. కానీ పై రెండు కేసుల్లో విచిత్రంగా ఎవరిదీ తప్పు లేదని తేల్చేశారంటే ఆశ్చర్యంగా ఉంది.

మొదటగా బాబ్రీ మసీదు ఘటనే తీసుకుందాం. 1992, డిసెంబర్లో జరిగిన మసీదు కూల్చివేతలో అసలు కుట్రకోణమే లేదని సిబిఐ ప్రత్యేక కోర్టు తాజాగా తన తీర్పులో తేల్చేసింది. పలానా వారే మసీదును కూల్చమని జనాలను రెచ్చగొట్టినట్లు సాక్ష్యం లేదట. రెచ్చగొడుతున్నట్లు వీడియో, ఫొటో, నెగిటివ్ సాక్ష్యాలు కూడా లేవని చెప్పేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది నిందితులకు మసీదు కూల్చివేతలో ఎటువంటి పాత్ర లేదని, వారి పాత్ర ఉన్నట్టు తమ విచారణలో నిరూపితం కాలేదని కోర్టు చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యేకకోర్టు చెప్పిందే నిజమనుకుంటే మరి ఎల్కే అద్వాణీ అసలు రథయాత్ర ఎందుకు చేసినట్లు ?

మసీదు దగ్గరకు దేశవ్యాప్తంగా కరసేవకులను రమ్మని ఎందుకు పిలుపిచ్చినట్లు ? మసీదును కూల్చేసి రామజన్మభూమిని నిర్మిస్తామంటూ అప్పట్లో నిందితులు చేసిన బహిరంగ ప్రసంగాలు యూట్యూబ్ వీడియోల్లో కనబడుడతున్న విషయం అందరికీ తెలిసిందే. పైగా ఇదే ఘటనపై విచారణ జరిపిన లిబరహాన్ కమీషన్ ఛైర్మన్ లిబరహాన్ మాట్లాడుతూ నిందితులందరు దోషులే అంటూ తేల్చేశారు. తాను జరిపిన విచారణలో ఉద్దేశ్యపూర్వకంగానే మసీదును కూల్చేసినట్లు ఉమాభారతి లాంటి వాళ్ళు చెప్పినట్లు లిబర హాన్ చెప్పటం సంచలనంగా మారింది. సరే కోర్టు విచారణలో ఏమి జరిగిందో కానీ మొత్తం మీద అందరికీ క్లీన్ చిట్ వచ్చేసింది.

ఇక రెండో అంశమైన నయీం విషయం తీసుకుంటే మొత్తం 25 మంది పోలీసు అధికారులకూ సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. నయీంతో అంటకాగినట్లు ఏ ఒక్క పోలీసు అధికారిపైనా సాక్ష్యం దొరకలేదట. మరి ఇదే నిజమైతే అప్పట్లో నయీంతో అంటకాగినట్లు, నయీంతో కలిసి కోట్లాది రూపాయలు సంపాదించారన్న ఆరోపణలపై అడిషినల్ ఎస్పీ నుండి ఎస్ఐ స్ధాయి వరకు 25 మందిని ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసినట్లు ? అప్పట్లో ఏ ఆధారాలతో 25 మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ? అప్పట్లో పోలీసు అధికారులను సస్పెండ్ చేయటానికి సరిపోయిన ఆధారాలు మరిపుడు సిట్ కు ఎందుకు కనబడలేదు ? అంటే వీళ్ళందరినీ సస్పెండ్ చేసిన ప్రభుత్వంది తప్పా ? లేకపోతే నయీం దందాల్లో పోలీసు అధికారుల పాత్రను సమర్ధవంతంగా రుజువు చేయలేకపోయిన సిట్ ది తప్పా ?