పెనుకొండ కోసం.. ప‌రిటాల ప‌ట్టు.. ఇస్తారా?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పుంజుకోవాలన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్నా.. ఇప్ప‌టికిప్పుడు పార్టీ అధినేత చంద్ర‌బాబు ముందున్న ఏకైక వ్యూహం.. నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం.. స‌ర్వ‌త్రా అసంతృప్తితో అట్టుడుకుతున్న పార్టీలో నేత‌ల‌ను బుజ్జ‌గించ‌డం, వారిని లైన్‌లో పెట్ట‌డం! ఈ విష‌యంలో ఒకింత ముందుగానే మేల్కొన్న చంద్ర‌బాబు ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌లే పార్ల‌మెంట‌రీ జిల్లాల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. మొత్తంగా పాతిక మందికి ప‌ద‌వులు ఇచ్చారు. అదేస‌మ‌యంలో రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌లిపి ఒక స‌మ‌న్వ‌య క‌ర్త‌ను ఏర్పాటు చేశారు.

దీంతో మ‌రో 13 మందికి ప‌ద‌వులు ద‌క్కాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రికొంద‌రు కీల‌క నాయ‌కులు.. కుటుంబాల‌కు కుటుంబాలే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా.. గుర్తింపు లేద‌ని బాధ‌ప‌డుతున్న వారికి కూడా చంద్ర‌బాబు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముఖ్యంగా అనంత‌పురం జిల్లాలో పార్టీకి అండ‌గా ఉంటున్న ప‌రిటాల ర‌వి కుటుంబానికి చంద్ర‌బాబు కీల‌క ప‌ద‌వులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. దేవినేని అవినాష్‌.. ఖాళీ చేసిన‌.. తెలుగు యువ‌త ప‌గ్గాల‌ను ప‌రిటాల శ్రీరాంకు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అదే స‌మ‌యంలో ప‌రిటాల కుటుంబం రెండేళ్లుగా కోరుతున్న పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించేందుకు చంద్ర‌బాబు రెడీ అవుతున్న‌ట్టు సీనియ‌ర్లు చెబుతున్నారు. ప‌స్తుతం రాప్తాడు బాధ్య‌త‌ల‌ను ప‌రిటాల కుటుంబమే చూస్తోంది. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ప‌రిటాల సునీత‌.. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో శ్రీరాంకు ఇక్క‌డ ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే త‌మ‌కు పెనుకొండ‌, రాప్తాడు ఇవ్వాల‌ని ఈ కుటుంబం ప‌ట్టుబ‌ట్టింది.

పెనుకొండలో ప‌రిటాల ర‌వి ప‌లుమార్లు విజ‌యం సాధించిన చ‌రిత్ర ఉండ‌డం, ర‌వికి అనుకూల వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతో శ్రీరాంను గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచే పోటీ చేయించాల‌ని సునీత అనుకున్నారు. కానీ, చంద్ర‌బాబు రాప్తాడుకే ప‌రిమితం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. ఈ నేప‌థ్యంలోనే బాబు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఒకింత అస‌హ‌నంతో ఉన్న ఫ్యామిలీకి ఇప్పుడు తెలుగు యువ‌త పోస్టు స‌హా.. పెనుకొండ పార్టీ బాధ్య‌త‌ల‌ను కూడా అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ప‌రిటాల కుటుంబంలోనే కాకుండా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఊపు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.