ఏపీ నంబ‌ర్ వ‌న్‌.. క్రెడిట్ కోసం కొట్లాట‌

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ఏటా జాతీయ స్థాయిలో రిలీజ్ చేసే జాబితా కోసం రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తుంటాయి. ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి, వ్యాపారం చేయ‌డానికి ఆయా రాష్ట్రాల్లో ప‌రిస్థితులు, ప్ర‌భుత్వ విధానాలు ఎంత సౌక‌ర్యంగా ఉన్నాయి అన్న‌దాన్ని బ‌ట్టి ఇందులో ర్యాంకులు ఇస్తారు.

వ‌రుస‌గా రెండో ఏడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈ జాబితాలో అగ్ర‌స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 2018లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచిన ఏపీ.. 2019కి కూడా ఆ స్థానాన్ని నిల‌బెట్టుకున్న‌ట్లు వెల్ల‌డైంది. దీని మీద సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ ర్యాంకు తాలూకు క్రెడిట్ కోసం అధికార వైకాపా.. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం వ‌ర్గీయులు తెగ కొట్టేసుకుంటున్నారు. 2019 మే నుంచి జ‌గ‌న్ స‌ర్కారు ప‌రిపాల‌న న‌డుస్తోంది కాబ‌ట్టి ఈ ర్యాంకు క్రెడిట్ ఆ ప్ర‌భుత్వానిదే అంటున్నారు వైకాపా వ‌ర్గీయులు. కానీ తెలుగుదేశం వ‌ర్గీయుల వాద‌న భిన్నంగా ఉంది. 2018-19 వార్షిక సంవ‌త్స‌రానికి కేటాయించిన ర్యాంకు ఇద‌ని.. కాబ‌ట్టి ముందు సంవ‌త్స‌రం నుంచి లెక్క పెడితే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న‌ది తెలుగుదేశం ప్ర‌భుత్వ‌మే కాబ‌ట్టి ఈ ర్యాంకు ఘ‌న‌త బాబుకే ద‌క్కుతుంద‌ని అంటున్నారు.

సాంకేతికంగా ఏ కాలానికి ఈ ర్యాంకు ఇచ్చార‌న్న దానిపై స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది. దీనిపై పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ఐతే వ‌చ్చే ఏడాదికి వ‌చ్చే ర్యాంకు మాత్రం జ‌గ‌న్ స‌ర్కారుకే చెందుతుంది. అప్పుడు వైకాపా ప్ర‌భుత్వ స‌మ‌ర్థ‌త ఏంటో స్ప‌ష్టంగా తెలిసిపోతుంది.