శ‌భాష్ గంభీర్.. ప‌నిమ‌నిషికి అంత్య‌క్రియలు

భార‌త మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మ‌న్ గౌత‌మ్ గంభీర్ వ్య‌క్తిత్వం ఎలాంటిదో చెప్ప‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. అత‌డికి దేశ‌భ‌క్తి సామాజిక సేవా దృక్ప‌థం కొంచెం ఎక్కువే. ఈ విష‌యంలో అనేక‌సార్లు త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నాడు. ఇప్పుడు అత‌ను ఓ గొప్ప ప‌నితో వార్త‌ల్లో నిలిచాడు. తన ఇంట్లో ప‌ని మ‌నిషిగా ఉన్న‌సరస్వతి పత్రా అంత్యక్రియలను త‌నే నిర్వహించాడు ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పని చేస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా షుగ‌ర్‌, హైబీపీతో బాధ‌ పడుతోంది. కొన్ని రోజుల కింద‌ట ఆమె ప‌రిస్థితి విష‌మించింది. ఇటీవ‌లే ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అయితే లాక్‌డౌన్ కారణంగా మృతదేహాన్ని ఒడిశాలో ఉంటున్న ఆమె కుటుంబానికి పంపలేని పరిస్థితి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో స‌ర‌స్వ‌తి ప‌త్రా అంత్య‌క్రియ‌ల్ని త‌నే చేయాల‌ని గంభీర్ నిర్ణ‌యించుకున్నాడు. లాక్ డౌన్ నేప‌థ్యంలో పెద్ద‌గా జ‌నాల్లేకుండా గంభీర్ కుటుంబ స‌భ్యులు, స‌హాయ‌కులు మాత్ర‌మే అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌గా.. గంభీర్ కొడుకులా మారి ఆమె లాంఛ‌నాల‌న్నీ ముగించాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గంభీర్‌ వెల్లడించాడు.‘‘నా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ పని మనిషి కాదు. ఆమె నా కుటుంబ సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందర్నీ గౌరవించాలనేదే నా సిద్ధాంతం. ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ఇదే మార్గం. అది నా దేశం ఆలోచన. ఓం శాంతి’’ అని గంభీర్ ట్వీట్‌ చేశారు.

త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్న గంభీర్‌ను కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స‌హా చాలామంది అభినందించారు. సరస్వతి ఒడిశాలోని జాజ్‌పుర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మ‌హిళ‌ స్థానిక మీడియా వెల్ల‌డించింది.