అర్చకులకు టీటీడీ రక్షణ కల్పించడం లేదన్న రమణ దీక్షితులు

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేరు ఈ మధ్యకాలంలో వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు హయాంలో 20 మందికి పైగా అర్చకులను రాజ్యాంగవిరుద్ధంగా రిటైర్ చేయించారని సంచలన ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, ఏఈవోలపైనా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా జగన్ హయాంలోనూ టీటీడీపై రమణ దీక్షితులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే అర్చకులలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలినా…ఈవో, అదనపు ఈవో దర్శనాలు అపడం లేదని రమణ దీక్షితులు ఆరోపించారు. అయితే, టీటీడీ వ్యవహారాలను రమణ దీక్షితులు మీడియా ముందు మాట్లాడడం, రాజకీయాలు చేయడం సరికాదని, టీటీడీ బోర్డుకు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని టీటీడీ పాలకమండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి గతంలోనే అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, తాజాగా రమణ దీక్షితులు మరోసారి టీటీడీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.

అర్చకుల రక్షణ విషయంలో టీటీడీ పూర్తిగా విఫలమైందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కన్నుమూసిన అర్చకుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ సీఎ జగన్, వైవీ సుబ్బారెడ్డిలను ట్యాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. గతంలో అన్యాయంగా పదవీ విరమణకు గురైన మాజీ ప్రధాన అర్చకుడు ఒకరు వంశపారంపర్య సేవలను పునరుద్ధరించాలని పోరాడారని, ఆయన మరణించారని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. ఆయనతోపాటు మరో 45 ఏళ్ల జూనియర్ అర్చకుడు స్వామివారికి సేవలందిస్తూ మరణించారని అన్నారు. వీరిని కాపాడడంలో టీటీడీ విఫలమైందని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలను ట్యాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అయితే, టీటీడీకీ రమణ దీక్షితులు సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నిరభ్యంతరంగా ఇవ్వవచ్చని, కానీ, మీడియా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం సరికాదని వైవీ సుబ్బారెడ్డి గతంలోనే చెప్పారు. అయినప్పటికీ, రమణ దీక్షితులు మరోసారి సోషల్ మీడియా వేదికగా టీటీడీని నేరుగా విమర్శించడం చర్చనీయాంశమైంది. రఘురామకృష్ణరాజు తరహాలోనే నేరుగా రమణ దీక్షితులు మీడియా ముందుకు వెళ్లడంపై సీఎం జగన్ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అర్చకులకు కరోనా సోకుతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం చేసిన రమణ దీక్షితులుపై జగన్ అసహనం వ్యక్తం చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయినప్పటికీ, రమణ దీక్షితులు తాజాగా టీటీడీపై వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది. రమణ దీక్షితులు మరో రఘురామకృష్ణరాజు కాబోతున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, రమణ దీక్షితులు ట్వీట్ పై వైవీ, జగన్ లు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.