కరోనా ఇంతలా విజృంభిస్తుంటే ఆ ట్వీట్లేంటి సారూ..

ఇండియాలో కరోనా కేసులు 800కు చేరువ అయ్యాయి.. ఏపీలో కేసులు పది మాత్రమే.. దేవుడి దయ వల్ల మన దగ్గర కేసులు పెరగట్లేదు.. అంటూ కొన్ని వారాల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా ఉత్సాహంగా మాట్లాడారు. కట్ చేస్తే ఇప్పుడు ఇండియాలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి.

మర్కజ్ ప్రార్థనల ప్రభావం బాగా పడ్డ రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ఐతే దాని మీద నింద వేసేసి ఊరుకునే పరిస్థితి లేదు. ఏపీలో కట్టుదిట్టమైన చర్యలు లేకపోవడం, జగన్ సహా వైకాపా నాయకులంతా కరోనా గురించి తేలిగ్గా మాట్లాడటం, సోషల్ డిస్టన్స్ పాటించకుండా అనేక కార్యక్రమాలు చేయడం.. ప్రచార హడావుడి విపరీతంగా కనిపిస్తుండటం కరోనా వ్యాప్తి పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.

గురువారం నాడు ఏపీలో రికార్డు స్థాయిలో 80 కరోనా కేసులు బయటపడ్డాయి. ముందు రోజు 56 కేసులు నమోదు కాగా.. శుక్రవారం 62 కొత్త కేసులు బయటపడ్డట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దీన్ని బట్టి చూస్తుంటే ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదని స్పష్టమవుతోంది. ముందు ముందు పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఐతే వైకాపా నాయకుల ప్రచార హడావుడి, ఎలివేషన్లు.. ప్రత్యర్థులపై అవసరం లేని విమర్శలు మాత్రం ఆగట్లేదు. వైకాపా అగ్ర నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్లు అందుకు నిదర్శనం.

‘‘రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణ నష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అనుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. డబ్ల్యూహెచ్వో కూడా ఆరా తీస్తోంది’’ అంటూ ఎలివేషన్ ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.

పనిలో పనిగా ఎప్పట్లాగే చంద్రబాబును తిడుతూ కూడా ట్వీట్లు వేశారు. ఓవైపు ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతుంటే.. డబ్ల్యూహెచ్వో ఆరా తీస్తున్నట్లు.. కేంద్రం ప్రశంసించినట్లు.. మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్నట్లు డప్పుకొట్టుకోవడం విజయసాయిరెడ్డికే చెల్లింది.