బెంగళూరు అల్లర్లు.. ఆజ్యం పోసింది ఎవరు?

ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన గ్రీన్ సిటీ బెంగళూరు మంగళవారం రాత్రి అల్లకల్లోలంగా మారిపోయింది. రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన పోస్టుల యుద్ధం.. చివరకు నగరంలోని బీజే హళ్లి ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చేసింది. ఈ ఘటనలో ఓ వర్గం వారు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆరోపిస్తూ… అందుకు నిరసనగా నగరంలోని వీధుల్లోకి వచ్చి వీరంగం చేశారు. శాంతిభద్రతల కోసం అహరహం శ్రమిస్తున్న పోలీసులు, పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. ఈ దాడులను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా… శాంతిభద్రతల పర్యవేక్షణలో నిమగ్నమైన పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సరే… ఈ గొడవలు కాస్తంత సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా.. అసలు ఈ గొడవ ఎలా మొదలైంది? ముందుగా వివాదాన్ని రేపింది ఎవరు? ఆ వివాదానికి స్పందించి ఆజ్యం పోసింది ఎవరు? అన్న విషయంపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే ఆసక్తికర చర్చ సాగుతోంది.

ప్రాథమిక విచారణలో భాగంగా దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి అల్లుడు నవీన్… ముస్లిం ఆరాదించే మొహమ్మద్ ప్రవక్తను రేపిస్ట్ గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితే.. దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మైనార్టీ వర్గానికి చెందిన వారు నానా బీభత్సం సృష్టించారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ ను అరెస్ట్ చేసి.. అల్లర్లను సద్దుమణిగేలా చర్యలు చేపట్టారు. అయితే నవీన్ అరెస్టయ్యేదాకా అతడే ఈ గొడవకు మూల కారకుడని అంతా భావించారు. అయితే ఆ తర్వాతే… అసలు విషయలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఈ వివాదానికి తెర తీసింది మైనారిటీ వర్గానికి చెందిన వారేనని ఇప్పుడు సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హిందువులంతా భక్తి శ్రద్ధలతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్న తరుణంలో శ్రీకృష్ణుడు రేపిస్ట్ అని మైనారిటీ వర్గానికి చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారట. దీనిని చూసిన నవీన్… దానికి ప్రతిస్పందనగా… మొహమ్మద్ ప్రవక్త కూడా 9 ఏళ్ల బాలికను రేప్ చేశారంటూ తనదైన శైలి పోస్ట్ పెట్టాడు. మైనారిటీ వర్గం పెట్టిన పోస్ట్ అంతగా బయటకు రాకున్నా… నవీన్ పెట్టిన పోస్ట్ మాత్రం బెంగళూరు రావణ కాష్టంగా మారడానికి కారణమైందని నెటిజన్లు దాదాపుగా తేల్చేశారు. మైనారిటీ వర్గానికి చెందిన వారు హిందూ దేవతలను దూషిస్తూ పోస్ట్ పెడితే… దానిపై పోలీసులు ఫిర్యాదు చేయడానికి బదులుగా నవీన్ తాను కూడా వారి బాటలోనే ఆలోచించి మొహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా పోస్ట్ పెట్టడ సరికాదన్న వాదన వినిపిస్తోంది.

అదే సమయంలో మొహమ్మద్ ప్రవక్తపై పోస్ట్ పెట్టినందుకు నవీన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు… అసలు ఈ మొత్తం వివాదానికి కారణమైన పోస్ట్ ను పెట్టిన మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేయకపోవడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నవీన్ పోస్ట్ వారేమీ సమర్థించడం కూడా లేదు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, అయితే కేవలం నవీన్ ను మాత్రం అరెస్ట్ చేసిన పోలీసులు… మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తుల గురించి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన రెండు పోస్టుల కారణంగా ఇప్పుడు బెంగళూరు రణరంగంగా మారిపోయింది. అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం… ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలి విచారణకు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోంది. వివాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై…జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే కక్కిస్తామని పేర్కొనడం గమనార్హం.