అమెరికాపై చైనా ‘విత్తనాల’ కుట్ర?

ఆంత్రాక్స్.. ఒకప్పుడు ఈ పదం ఓ సంచలనం. ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అమెరికాపై బయోవార్ చేసే ఉద్దేశంతో ఉగ్రవాదులు ఈ ఇన్ఫెక్షన్ కలిగించే పౌడర్‌ను ఆ దేశానికి పంపేవాళ్లు. అమెరికన్ల అడ్రస్‌లు సేకరించి.. రాండమ్‌గా ఆంత్రాక్స్ పౌడర్‌ను కొరియర్, పోస్టు చేసేవాళ్లు. ఆ ప్యాకెట్ తెరవగానే ఇన్ఫెక్షన్ సోకేది. 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత మీడియా వాళ్లతో పాటు వివిధ వర్గాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదవాదులు ఆంత్రాక్స్ ఎటాక్స్ చేశారు. అప్నట్లో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు అమెరికాకు బద్ధ విరోధిగా మారిన చైనా.. ఆ దేశంపై ఇలాగే మరో రకమైన దాడి చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి అమెరికన్లకు ప్యాకెట్ల ద్వారా విత్తనాలు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.

అమెరికా వాతావరణాన్ని దెబ్బ తీసే ఉద్దేశంతో చైనీయులు ఈ విత్తనాలు తయారు చేసి పంపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విత్తనాలు నాటితే అవి వాతావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తాయని అంటున్నారు. వందల సంఖ్యలో అమెరికన్లు ఈ విత్తనాల ప్యాకెట్లను పోస్ట్, ఇతర మార్గాల్లో అందుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న యుఎస్ వ్యవసాయ విభాగం శాస్త్రవేత్తలు వాటిని సేకరించి పరిశోధన జరుపుతున్నారు. కచ్చితంగా ఇది చైనా కుట్రలో భాగమే అని భావిస్తున్నారు. ప్రపంచంలో తమ ఆధిపత్యానికి సవాలు విసిరే చైనాతో అమెరికాకు ఎప్పుడూ కయ్యమే. ఈ మధ్య అది మరింత ముదిరింది. ప్రస్తుతం అమెరికా కరోనాతో అల్లాడుతుండటానికి చైనానే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశం గురించి తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో ఇరు దేశాల మధ్య అగాథం మరింత పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఈ విత్తనాల గొడవ చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏం తేలుస్తారో చూడాలి.