700 కిలోమీటర్లు.. ఏడు హామీలు 

Lokesh Nara

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర కీలక ఘట్టానికి చేరుకుంటోంది. చిత్తూరు దాటి అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న యాత్రలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. పెనుకొండ నుంచి  రాప్తాడు నియోజకవర్గంలోకి వచ్చిన యాత్రకు  పరిటాల కుటుంబం ఘనస్వాగతం పలికింది. వైసీపీ తప్పిదాలను ఎండగడుతూ వెళ్తున్న లోకేష్ .. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో కూడా వివరిస్తున్నారు. యువగళం  ఇప్పటికే 700 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ప్రతీ వంద కిలోమీటర్లకు లోకేష్ ఒక స్పష్టమైన హామీని జనంలోకి వదులుతున్నారు.. జనవరి 27న కుప్పంలో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది..

100 – బంగారుపాళ్యం..

‘ప్రగ‌తికి పునాది రాళ్లు-యువ‌గ‌ళం మైలురాళ్లు’ పేరుతో జనంలోకి వచ్చిన నారా  లోకేష్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వంద కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. అధికారానికి రాగానే అక్కడ సొంత  నిధులతో డయాలసిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని  హామీ ఇచ్చారు. 

200 – కార్వేటి నగరం 

దాదాపు వారం  తర్వాత ఆయన కార్వేటి నగరం నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల మైలురాయిని తాకారు. అక్కడ కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేదని తెలిసి, టీడీపీ అధికారంలోకి రాగానే డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని  హామీ ఇచ్చారు. 

300 – శ్రీకాళహస్తి 

ప్రముఖ  శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో తిరుగుతూ ఆయన 300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. 13 గ్రామాల దాహార్తి తీర్చే తాగునీటి ప‌థ‌కం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. 

400 – చంద్రగిరి 

తన తండ్రి చంద్రబాబు పుట్టిన గడ్డ చంద్రగిరిలో లోకేష్ 400 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. అక్కడ ఒక గ్రామంలో పది పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తానని లోకేష్ చెప్పారు..

500 – మదనపల్లి 

మదనపల్లి  నియోజకవర్గంలో లోకేష్ 500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. టమాట రైతుల కష్టాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అధికారానికి రాగానే టమాట ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. లోకేష్ మాటలు రైతులకు కొండంత అండగా నిలిచాయి.

600 – కదిరి 

నడుస్తూ  నడుస్తూనే లోకేష్ 600 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. కదిరిలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. 

700 – పెనుకొండ 

పెనుకొండ నియోజకవర్గంలో లోకేష్ 700 కిలోమీటర్ల మైలురాయిని దాటారు గట్టూరులో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కియా పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకుని అది తాము తీసుకొచ్చిన పరిశ్రమేనని గుర్తు చేశారు. హంద్రీ నీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. మడకశిర ప్రాంతవాసుల తాగు, సాగు నీటి  సమస్క పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

లోకేష్ హామీలతో జనంలో టీడీపీ పట్ల విశ్వాసం పెరుగుతోందని చెబుతున్నారు.