మగవారు పోరంబోకులు.. –  మంత్రి ధర్మాన వివాదాస్ప‌ద కామెంట్స్‌

dharmana

‘మగవారు పోరంబోకులు.. తినేసి వెళ్లిపోతారు’ అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  ఆసరా పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలోని కిల్లిపాలెం, హడ్కో కాలనీలో రెండు చోట్ల మహిళలతో సమావేశం నిర్వహించి మరీ మగవారిని పోరంబోకులంటూ విమర్శించారు. మంత్రి మాట్లాడుతూ ‘మగవాళ్లు పోరంబోకులు. బాగా తిరిగేసి వస్తారు. తినేసి వెళ్లిపోతారు. ఇలా అంటున్నప్పుడు కొంతమంది చప్పట్లు కొడుతున్నారంటే అంగీకరించినట్లే. ఆ పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదన్నదే జగనన్న ప్రభుత్వ ఉద్దేశం. ఇంటిని నడిపేది ఇల్లాలు. ఆమె పేరుతో ప్రభుత్వ పథకాలు అందిస్తుంది జగన్ ప్రభుత్వం` అని అన్నారు.

ఆడవారికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అధికారం ఉంది కాబట్టే సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామ‌ని తెలిపారు. సంపదను మీచేతిలో పెడుతున్నామ‌ని, అధికారం అప్పగించే అధికారం మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. ఇంకా ఏడాది మాత్రమే అధికారం ఉందని, అది అయిపోయిన తర్వాత మరి ఇవ్వలేడని, చాలా మంది నెగిటివ్‌గా మాట్లాడుతున్నారని చెప్పారు. “ఇంటాయన చెప్పారని.. కొడుకు చెప్పారని.. ఓటు ఎవరికో వేయవద్దు. మహిళలకు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే వైసీపీ మ‌రోసారి అధికారంలోకి రావాలి. అధికారంలో లేక పోతే ఇవ్వలేరు“ అని ధ‌ర్మాన వ్యాఖ్యానించారు.

మా ప‌థ‌కాలు తీసుకుని సైకిల్‌కు ఓటేస్తారా?

“ఇటీవల గార మండలంలో ఓ గ్రామం వెళ్లాను. ఓ మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. ఎవరిస్తున్నా రు..? అని అడిగాను. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. జగన్మోహనరెడ్డి ఇస్తున్నారని చెప్పింది ఆ మహిళ. మరి ఓటు ఎవరికి వేస్తావు అని అడిగాను. సైకిల్‌కు వేస్తాను అని చెప్పింది . ఆమెకు జగన్ ఇస్తున్న పథకాలు తెలుసుకానీ.. పార్టీ గుర్తు తెలియలేదు. చాలామంది ఇలానే ఉన్నారు. వీరికి పూర్తిగా అవగాహన కల్పించాలి’ అని ధ‌ర్మాన‌ పేర్కొన్నారు.

మునిసిప‌ల్ నీళ్లు ఆపేయండి!

శ్రీకాకుళంలో హడ్కోకాలనీలో సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గేట్లు వేసేసి.. మహిళలు ఎవరినీ బయటకు వెళ్లకుండా సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలోనే మంత్రి మాట్లాడుతూ ‘గేట్లు వేశాం కాబట్టి.. ఎవరూ గోడలు గెంతలేరు.. లేకుంటే ఇక్కడ పిట్ట  కూడా ఉండదు’ అని అన్నారు. అలాగే ఈ సమయంలో మున్సిపల్ కొళాయిల నుంచి నీరు ఇవ్వవద్దని.. ఆలస్యంగా ఇవ్వాలని.. నీళ్ల కోసం వెళ్లిపోతారని వేదికపై నుంచే మంత్రి ధర్మాన.. మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించడం మ‌రింత వివాదంగా మారింది.