అత్యధిక కేసులున్న రాష్ట్రంలోకి ఎంట్రీ పాసులా?

7948.. ఒక రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇది. ఈ నంబర్ చూడగానే ఏ మహారాష్ట్రో.. తమిళనాడో.. లేదంటే ఢిల్లీ అయి ఉండొచ్చని అంతా అనుకుంటారు. కానీ ఒక రోజులో ఇన్ని కేసులు నమోదైంది మన ఆంధ్రప్రదేశ్‌లో అంటే షాకవ్వాల్సిందే. అక్కడ కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేస్తున్నాం.. త్వరగా పాజిటివ్ కేసుల్ని గుర్తించి.. వారి నుంచి ఇంకెవరికీ వైరస్ సోకకుండా చూస్తున్నాం.. వైరస్‌ను నియంత్రించడానికి అన్ని చర్యలూ చేపడుతున్నాం అని ఏపీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది కానీ.. రోజు రోజుకూ అసాధారణ రీతిలో పెరిగిపోతున్న కేసుల సంఖ్య.. చిన్న చిన్న పల్లెటూళ్లు కూడా కరోనా కేంద్రాలుగా మారిపోతున్న తీరు చూస్తే మాత్రం ఆందోళన అంతకంతకూ పెరిగిపోతోంది.

మహారాష్ట్రను మించి దేశంలోనే ఒక రోజులో అత్యధికంగా కరోనా కేసులు బయటపడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టిస్తే.. ఇప్పటికీ ఆ రాష్ట్రంలోకి ప్రవేశించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతర్ రాష్ట్ర బస్సులపై నిషేధం కొనసాగుతోంది. వ్యక్తిగత వాహనాల్లో ఏపీలోకి రావాలన్నా ఎంట్రీ పాసులు తీసుకోవాల్సిందే. ఇన్నాళ్లు ఏం కట్టడి చేశారో ఏమో కానీ.. ఏపీలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల వాళ్లు ఇక్కడికి వైరస్‌ను తీసుకురావడం ఏమో కానీ.. ఇక్కడికి వస్తే కరోనా లేకుండా బయటికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. ఏపీలో ఇలాంటి మెట్రో సిటీలు లేవు కాబట్టి వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని జనాలు పనులు, నివాసాల్ని విడిచిపెట్టి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆ నగరాలకు భిన్నంగా ఏమీ లేవు ఇక్కడి పట్టణాలు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏపీలో ప్రవేశానికి ఎంట్రీ పాసులు తీసుకోవాలని నియమం పెట్టి జనాల్ని ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమో జగన్ సర్కారు ఆలోచించాలి.