విజయసాయిని వెక్కిరిస్తున్న పాత ట్వీట్లు

కాలు జారినా ఫర్లేదు కానీ మాట జారకూడదని పెద్దోళ్లు ఊరికే అనలేదేమో మన పెద్దోళ్లు. నోటి వెంట వచ్చే మాట ప్రభావం చాలానే ఉంటుంది. ఇక.. రాత అంటారా? అక్షరం బలి కోరుకుంటుందన్న మాటను మరవలేం. మరి.. నోటి వెంట వచ్చే మాటను అక్షరం రూపంలోకి తెచ్చి ట్వీట్ రూపంలో సంధిస్తే ఎలా ఉంటుంది? ఆయుధం ఎలాంటిదైనా తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అప్పటివరకూ బాగానే ఉన్నా.. ఆ ఆయుధాన్ని వినియోగించిన దాని సైడ్ ఎఫెక్టులు కొన్నిసార్లు తగులుతాయి. అందుకే.. ఆయుధాన్ని వాడేటప్పుడు ఆచితూచి వాడమంటారు.

కీలక స్థానాల్లో ఉన్న వారు అదే పనిగా మాట్లాడటం కనిపించరు. అపర చాణుక్యుడిగా అభివర్ణించే పీవీ కావొచ్చు.. యూపీఏ ప్రభుత్వానికి రిమోట్ గా వ్యవహరించిన సోనియా కావొచ్చు.. ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తారే తప్పించి.. అనవసరంగా మాట్లాడరు. ప్రధాని మోడీ పరిస్థితి కూడా ఇలాంటి కోవకు చెందిన వారే. ఎప్పుడు మాట్లాడాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి.

రాజకీయాల్లో ప్రత్యర్థులు సర్వ సాధారణం. అలా అని అదే పనిగా ప్రత్యర్థుల మీద విరుచుకుపడటం కొందరికి అలవాటు. అలాంటి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే విజయసాయి రెడ్డికి తాను అనుకున్నది అనుకున్నట్లు అనేసేందుకు అస్సలు మొహమాటపడరు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో విరుచుకుపడటంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఎదుటోడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆయనకు మాత్రం రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే కనిపిస్తారు. ఆయన చేసిన ట్వీట్లు చూస్తే.. ప్రత్యర్థుల విషయంలో జాలి.. దయ లాంటివి అస్సలు కనిపించవు.

అలాంటి ఆయన ప్రస్తుతం కరోనా పాజిటివ్ పాలయ్యారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆయన చేసిన కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అందులో ఆయన జగన్ సర్కారును పొగిడేస్తున్న వైనం ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ‘‘ఆరోగ్య శ్రీ ద్వారా జగన్ గారి ప్రభుత్వం కరోనాకు చికిత్స చేస్తోంది. దేశంలోనే ఈ మహామ్మారికి వైద్యం పూర్తిగా ఉచితం చేసిన ఏకైక సర్కారు జగన్ గారిది. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అడ్డుకునేందుకు విధివిధానాలు జారీ చేసింది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

ఆయన పోస్టు చేసిన మరో ట్వీట్ లో.. ‘‘ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆసుపత్రే కావాలా? ఏం ఈఎస్ఐ ఆస్పత్రి వద్దా? మీ సీబీఎన్ హయాంలా కాదు జగన్ గారి ప్రభుత్వం. ఆస్పత్రులకు అన్ని హంగులు అద్దింది. సమస్య వస్తే చూసుకుంటుంది’’ అంటూ ట్వీట్లు చేసేశారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరిన్ని చిలకపలుకులు పలికిన విజయసాయి.. ఇప్పుడు తనకు కరోనా వస్తే.. ఏపీని వదిలేసి తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రిలో ఎందుకు చేరినట్లు? ఇంతకాలం ఏపీ సర్కారు గురించి గొప్పలు చెప్పిన విజయసాయి.. ఏపీలో వైద్యం ఎందుకు చేయించుకోనట్లు? లాంటి ప్రశ్నలు.. అందుకు సాక్ష్యంగా ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాట జారటం సామెత ఇప్పుడు అర్థమైందా?